థియేటర్ కు వెళ్లి మరీ ఆ సినిమా చూసిన వైఎస్ విజయమ్మ..
ఈ సినిమాను చూసిన వారిలో రాజకీయ రంగంలో కీలక నేత అయిన వైఎస్ విజయమ్మ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
By: Tupaki Desk | 28 Jun 2025 2:29 PM ISTమంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సాధారణంగా సోషల్మీడియాలో ట్రోలింగ్కు గురయ్యే మంచు ఫ్యామిలీకి ఈసారి అద్భుతమైన మద్దతు లభిస్తోంది. చిత్రంలోని కథ, విజువల్స్, నటన, మేకింగ్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
-విజయమ్మ థియేటర్లో 'కన్నప్ప' వీక్షణ
ఈ సినిమాను చూసిన వారిలో రాజకీయ రంగంలో కీలక నేత అయిన వైఎస్ విజయమ్మ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రిస్టియానిటిని పాటించే ఆమె సాధారణంగా సినిమాలకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా హిందూ పౌరాణిక గాథ ఆధారంగా రూపొందిన ‘కన్నప్ప’ సినిమాను థియేటర్కు వెళ్లి చూడటం విశేషంగా మారింది.. ఆమె తన కోడలు వెరోనికా , మంచు ఫ్యామిలీ సభ్యులతో కలిసి గచ్చిబౌలి ఏఎంబీ మాల్లో ఈ సినిమాను వీక్షించారు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ
‘కన్నప్ప’ చిత్రంపై టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా తమ పాజిటివ్ రివ్యూలను ఇస్తున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ ఈ చిత్రాన్ని చూసిన వెంటనే "నిజంగా అద్భుతంగా ఉంది. నా ఊహల కంటే వెయ్యి రెట్లు బాగుంది" అని ప్రశంసించారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నటించిన ఈ సినిమాలోని గ్రాఫిక్స్, విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. థియేటర్లలో హౌస్ఫుల్ షోలు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్స్లో ‘కన్నప్ప’ హ్యాష్ట్యాగ్ టాప్లో నిలవడం విశేషం. గూగుల్ ట్రెండ్స్లో కూడా కన్నప్ప మూవీ కీవర్డ్ విపరీతంగా సెర్చ్ అవుతోంది.
ఇటీవలి కాలంలో మంచు ఫ్యామిలీలో చోటు చేసుకున్న కుటుంబ విభేదాల నేపథ్యంలో ‘కన్నప్ప’ విజయవంతం కావడం ఆ కుటుంబానికి మానసికంగా ఎంతో తృప్తినిచ్చిన విషయమని చెబుతున్నారు. విజయమ్మ కూడా కూతురు వర్సెస్ కుమారుడి వివాదాలతో విసిగిపోతున్న తరుణంలో ఈ సినిమా ఆమెకు ఒక మంచి రిలీఫ్ను ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
