కందుకూరు పాలిటిక్స్: మాజీ లేరు.. ఎమ్మెల్యే జోరు.. !
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో రిమోట్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. నియోజక వర్గం పరిదిలోనే ఉన్నప్పటికీ.. నియోజకవర్గం కేంద్రానికి సుదూరంగా చాలా ప్రాంతాలున్నాయి.
By: Garuda Media | 24 March 2026 7:00 AM ISTఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో రిమోట్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. నియోజక వర్గం పరిదిలోనే ఉన్నప్పటికీ.. నియోజకవర్గం కేంద్రానికి సుదూరంగా చాలా ప్రాంతాలున్నాయి. గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వారు.. ఈ ప్రాంతాల్లోనూ పర్యటించి.. తమ హవా నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం నియోజకవర్గం కేంద్రంలో ఉన్న సమస్యలు మాత్రమే పట్టించుకుంటున్నారు.
ఇదిలావుంటే.. అసలు కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు లేకుండా పోయారన్నది స్పష్టంగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం దక్కించుకున్న మాగుంట మహీధర్రెడ్డి సీనియర్ నాయకుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అయితే.. గత ఎన్నికల్లో ఆయన గ్రాఫ్ బాగోలేదని పేర్కొన్న వైసీపీ.. పక్కన పెట్టింది. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఇక, ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన బుర్రా మధుసూదన్.. ఓటమి తర్వాత.. నియోజకవర్గంపై శీతకన్నేశారు.
అంతేకాదు.. తన సొంత నియోజకవర్గం కనిగిరిపైనే దృష్టి పెట్టారు. దీంతో కందుకూరులో వైసీపీ తరఫున వాయిస్ వినిపించే నాయకులు లేకుండా పోయారన్నది తెలుస్తోంది. మరోవైపు.. తనకు అవకాశం ఇవ్వాలని.. మాగుంట కోరుతున్నారు. కానీ, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. యువతను దృష్టిలో పెట్టుకుని మధుకు అవకాశం ఇచ్చినా.. ఆయన ఓటమి తర్వాత.. నియోజకవర్గాన్ని వదిలేయడం టీడీపీఎ మ్మెల్యేకు కలిసి వస్తోంది.
కానీ.. ఆయన జోరు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం.. కేవలం ఆఫీసు కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావడంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఆలోటు కనిపిస్తోంది. ఇటీవల కందుకూరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడు కూడా.. పెద్దగా హడావుడి కనిపించలేదు. దీంతో ఎమ్మెల్యే వైఖరిపై ప్రశ్నలు వచ్చాయి. అందరినీ కలుపుకొని పోవాలని.. అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించాలని సూచనలు వచ్చాయి. ఇదిలావుంటే.. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేకావడంతో కొంత అనుభవంలో వెనుకబడ్డారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
