పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న తొలి నిర్ణయం..
జమ్ము డివిజన్లోని మూడు పర్యాటక ప్రాంతాలైన రియాసిలోని దేవి పిండి, రాంబన్లోని మహు మంగత్, కిష్త్వార్లోని మొఘల్ మైదాన్ను కూడా తెరవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
By: Tupaki Political Desk | 17 Feb 2026 2:00 PM ISTజమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం (ఫిబ్రవరి 16) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మూసివేసిన 14 పర్యాటక ప్రాంతాలను తిరిగి తెరవాలని ఆదేశించారు. ఈ దాడి నేపథ్యంలో కేంద్రపాలిత ప్రాంతంలో దాదాపు 50 పర్యాటక కేంద్రాలను అధికారులు అప్పట్లో మూసివేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్ పట్టణానికి సమీపంలోని బైసరాన్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు.
భారత్ ను షాక్ కు గురి చేసిన ఘటన..
ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు అడిగి వారి మతాలను నిర్ధారించుకున్న తర్వాత లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మినహా అందరూ హిందువులే. సోమవారం సిన్హా తన సోషల్ మీడియా పోస్టులో.. ‘సమగ్ర భద్రతా సమీక్ష, చర్చల’ తర్వాత ఈ ప్రాంతాలను తిరిగి తెరవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు తిరిగి తెరిచిన పర్యాటక కేంద్రాల సంఖ్య 26కు చేరింది. సెప్టెంబర్, 26న 12 పర్యాటక ప్రాంతాలను తెరవాలని సిన్హా ఆదేశించినట్లు పీటీఐ నివేదించింది.
పర్యటకుల కోసం ఈ ప్రాంతాలు సిద్ధం..
‘కాశ్మీర్ డివిజన్లోని 11 పర్యాటక ప్రాంతాలైన యూస్ మార్గ్, దూద్ పథ్రి, కోకర్ నాగ్ లోని దండిపోరా పార్క్, పీర్ కీ గలీ, షోపియాన్ లోని దుబ్జన్, పద్పవాన్, అస్తాన్ పోరా, శ్రీనగర్ లోని ట్యులిప్ గార్డెన్, థాజ్వాస్ గ్లేసియర్, గందర్బల్ లోని హంగ్ పార్క్, బారాముల్లాలోని వులార్, వాట్లాబ్లను తక్షణమే తిరిగి ఓపెన్ చేయాలి’ అని సిన్హా పేర్కొన్నారు.
జమ్ము డివిజన్లోని మూడు పర్యాటక ప్రాంతాలైన రియాసిలోని దేవి పిండి, రాంబన్లోని మహు మంగత్, కిష్త్వార్లోని మొఘల్ మైదాన్ను కూడా తెరవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ‘కాశ్మీర్ డివిజన్లోని గురేజ్, అత్వటూ, బంగస్, జమ్ము డివిజన్ లోని రాంబన్లో ఉన్న రామకుండ్ మంచు తొలిగిన తర్వాత తిరిగి తెరుచుకోనున్నాయి’ అని ఆయన తెలిపారు.
పాక్ పై విరుచుకుపడిన భారత్..
జమ్ము-కశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ ఘటన వెనకున్నట్లు తేలింది. అనంతరం పాకిస్థాన్ పై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది.
వాటిలో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్.. ఉన్నాయి. వీటిని భారత్ పూర్తిగా ధ్వంసం చేసింది.
