Begin typing your search above and press return to search.

ట్రంప్ పోయినా.. కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలే.. భారతీయులకు షాకిచ్చిన జేడీ వాన్స్

అమెరికాలో స్థిరపడాలని.. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ కెరీర్‌లో రాణించాలని కలలు కనే భారతీయులకు.. ముఖ్యంగా ఐటీ నిపుణులకు మరో ఆందోళనకరమైన వార్త వినబడుతోంది.

By:  A.N.Kumar   |   10 July 2026 12:53 PM IST
ట్రంప్ పోయినా.. కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలే.. భారతీయులకు షాకిచ్చిన జేడీ వాన్స్
X

అమెరికాలో స్థిరపడాలని.. అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ కెరీర్‌లో రాణించాలని కలలు కనే భారతీయులకు.. ముఖ్యంగా ఐటీ నిపుణులకు మరో ఆందోళనకరమైన వార్త వినబడుతోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాల వల్ల ఇప్పటికే వేలాది మంది భారతీయులు, హెచ్-1బీ వీసాదారులు, అంతర్జాతీయ విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయితే ట్రంప్ కాలపరిమితి ముగిసిన తర్వాతైనా పరిస్థితులు సడలుతాయని ఆశించిన వారికి తాజా రాజకీయ సంకేతాలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి.

రిపబ్లికన్ పార్టీ తరఫున భవిష్యత్తులో అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారుగా మారే అవకాశం ఉన్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇమ్మిగ్రేషన్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తరహాలోనే ఆయన కూడా వలస విధానాలపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తారని స్పష్టం చేశారు.

అక్రమ హెచ్-1బీ కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఇటీవల మీడియాతో మాట్లాడిన జేడీ వాన్స్ అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందని ప్రకటించారు. నకిలీ పత్రాలు, మోసపూరిత కన్సల్టెన్సీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. వీసా లూప్‌హోల్స్‌ను వాడుకుంటూ నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయి. రాబోయే నెలల్లో ఇలాంటి అక్రమ సంస్థలకు చాలా కఠిన పరిస్థితులు ఎదురుకానున్నాయని ఆయన హెచ్చరించారు. "అమెరికాలో అక్రమ వలసలను అరికట్టడంతో పాటు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది " అని వాన్స్ స్పష్టం చేశారు.

నిజాయితీ గల ఉద్యోగులకూ తప్పని తిప్పలు?

జేడీ వాన్స్ ప్రకటించిన చర్యలు కేవలం అక్రమ కార్యకలాపాలు, నకిలీ కన్సల్టెన్సీలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ దీని ప్రభావం సాధారణ ఉద్యోగులపై కూడా పడే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రక్రియలు, ఎక్స్‌టెన్షన్ల సమయంలో డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మరింత కఠినతరం కావచ్చు. కంపెనీలపై నిఘా పెరగడం వల్ల నిజాయితీగా పనిచేస్తున్న హెచ్-1బీ నిపుణులు కూడా అదనపు విచారణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు ఈ తాజా పరిణామాలు మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.

భవిష్యత్తుపై రాజకీయ వర్గాల్లో చర్చ

జేడీ వాన్స్ గతంలో కూడా అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేయాలని పలుమార్లు డిమాండ్ చేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఆయన అధ్యక్ష పగ్గాలు చేపడితే వలస విధానాలు మరింత బిగుసుకుపోయే ప్రమాదం ఉందనే చర్చ అంతర్జాతీయ వేదికలపై నడుస్తోంది.

అయితే ప్రస్తుతానికి ఇవన్నీ రాజకీయ సంకేతాలు.. హెచ్చరికలు మాత్రమే. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక చట్టాలు లేదా నిబంధనలు వెలువడలేదు. కాబట్టి పరిస్థితులు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతాయో ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. అయినప్పటికీ అమెరికాలో స్థిరపడిన నిపుణులు, అక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ యువత మాత్రం ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తూ తమ డాక్యుమెంట్లు, కెరీర్ ప్లానింగ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.