Begin typing your search above and press return to search.

వైసీపీలో అంతా మంచోళ్లే.. వాడే మొండిఘటం.. జేసీ సంచలన వ్యాఖ్యలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   1 Jun 2025 4:59 AM
వైసీపీలో అంతా మంచోళ్లే.. వాడే మొండిఘటం.. జేసీ సంచలన వ్యాఖ్యలు
X

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ కు హెచ్చరికతో కూడిన సలహాలివ్వడమే కాకుండా, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అన్నా, ఆయన పార్టీ వైసీపీ అన్నా అగ్గిమీద గుగ్గిలమయ్యే జేసీ.. ఈ సారి కాస్త వెరైటీగా మాట్లాడారు. ఏడాదిగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన జేసీ జగన్ మారాలంటూ సూచించడం ఆసక్తిరేపుతోంది.

మాజీ సీఎం జగన్ అంటే జేసీ కుటుంబం మండిపడుతుంది. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగించినా, జగన్ తో మాత్రం తొలి నుంచి జేసీ కుటుంబం విభేదిస్తూనే వస్తోంది. గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంపై వెన్నుచూపని పోరాటం చేసిన జేసీ ఫ్యామిలీ ప్రస్తుతం అధికార పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధుల సమావేశంలో మాజీ సీఎం జగన్ కూడా పదేపదే తాడిపత్రి మున్సిపాలిటీపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పట్లో తాను అనుమతిస్తే జేసీ మున్సిపల్ చైర్మన్ అయ్యేవారు కాదని జగన్ చెబుతున్నారు. దీంతో తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

‘‘జగన్ మారాలి.. లేకపోతే కష్టమే’’ అంటూ వ్యాఖ్యానించిన జగన్.. ఇప్పటికీ బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే ప్రజలు ఒప్పుకోరంటూ తేల్చిచెప్పారు. ప్రజలు రక్షణ కోరుకుంటున్నారు. బెదిరింపు రాజకీయాలు ఎవరూ చేయలేరు. ఆ రోజులు పోయాయి. వాళ్ల నాయన (వైఎస్ రాజశేఖర్ రెడ్డి) కూడా మారాడు. అందుకే ప్రజలు యాక్సప్ట్ చేశారంటూ స్పష్టం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలీసులు, అధికారులను బెదిరించడం వల్ల జగన్ కు ఎలాంటి ప్రయోజనం దక్కదన్నారు. ప్రస్తుతం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని.. జగన్ ను ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో ఇప్పటికీ తెలుసుకోవడం లేదని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మార్పు దిశగా జగన్ అడుగులు వేయకపోతే ఆయనతోపాటు పార్టీలో ఉన్నవారు కూడా భూస్థాపితం అయిపోతారని అన్నారు. ‘‘మేమేం చేస్తాం. ప్రజలే చేస్తారు. అందురూ చూస్తున్నారు. ఏడాది అయిపోయింది. సింపతీలేదు. పైగా బెదిరింపులు. ఎవరు మాత్రం ఇష్టపడతారు.’’ అంటూ జేసీ తెలిపారు.

ప్రతిపక్ష నేతగా జగన్ ప్రజల్లోకి రావాలంటే ఇంకా సమయం ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఒక టీడీపీ నాయకుడిగా తాను జగన్ గురించి మాట్లాడటం లేదని చెప్పారు. వైఎస్ కుటుంబం, ముఖ్యంగా విజయమ్మ మొహం చూసి జగన్ కు సలహా ఇస్తున్నానని తెలిపారు. ‘‘పార్టీలో అందరూ మంచోళ్లే.. కానీ, ...డే మొండి ఘటం. ఎవరి మాట వినడు. చెబితే అర్థం చేసుకోడు. ఏం చేస్తారు పాపం.’’ అని జేసి వ్యాఖ్యానించారు. వచ్చేఎన్నికల నాటికి కూటమి మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. పథకాలు, సంక్షేమం ఇవన్నీ కాదని.. అభివృద్ధి, ఉద్యోగాలు కోరుకుంటున్నారని అన్నారు. ఒక ఇంట్లో రూ.20 వేలు సంపాదించే ఉద్యోగి కావాలా? ఏడాదికి రూ.10 వేలు ఇచ్చే సంక్షేమం కావాలా? అని జేసీ ప్రశ్నించారు.