Begin typing your search above and press return to search.

జయ నగల కోసం 6 పెద్ద ట్రంకు పెట్టెల్ని కోర్టుకు తీసుకురండి!

తాజాగా కోర్టు ప్రభుత్వానికి ఇచ్చేయనుంది. కోట్లాది రూపాయిల విలువైన ఈ బంగారు ఆభరణాల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకు వీలుగా కోర్టు ఉన్నత అధికారుల్ని న్యాయస్థానం వద్దకు రావాలని ఆదేశించింది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:41 AM GMT
జయ నగల కోసం 6 పెద్ద ట్రంకు పెట్టెల్ని కోర్టుకు తీసుకురండి!
X

అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొని.. దోషిగా నిరూపితమైన దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయిల కేజీల కొద్దీ బంగారాన్ని తాజాగా కోర్టు ప్రభుత్వానికి ఇచ్చేయనుంది. కోట్లాది రూపాయిల విలువైన ఈ బంగారు ఆభరణాల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసేందుకు వీలుగా కోర్టు ఉన్నత అధికారుల్ని న్యాయస్థానం వద్దకు రావాలని ఆదేశించింది. దీని కోసం ఆరు పెద్ద ట్రంకు పెట్టెల్ని తీసుకురావాలని చెప్పటం గమనార్హం.

దివంగత 'అమ్మ' జయలలితకు చెందిన బంగారు ఆభరణాల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు బెంగళూరులోని 36వ సిటీ సివిల్ సెషన్స్ కోర్టు రంగం సిద్ధం చేసింది. మార్చి ఆరేడు తారీఖుల్లో ఈ బంగారు నగల్ని తమిళనాడుకు చేర్చనున్నారు. ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారితో పాటు.. మీడియా సమక్షంలో ఈ బంగారు నగల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు.ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీయనున్నారు.

మొత్తం 7040గ్రాముల బంగారు, వజ్రాల ఆభరణాలు.. 700 కేజీల విలువ ఉన్న వెండి వస్తువుల్ని గతంలో జయ నివాసంలో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. వీటితోపాటు ఖరీదైనచీరలు.. వాచీలు.. చెప్పులతో పాటు ఇతర వస్తువులు కూడా వాటితో ఉన్నాయి. కోర్టు నుంచి స్వాధీనం చేసుకునే బంగారు, వజ్రాభరణాల్ని మ్యూజియంలో సంరక్షించే బాధ్యతను తమిళనాడు ప్రభుత్వం తీసుకోనుంది.

ఇదిలా ఉండగా.. జయ కేసును బెంగళూరులో విచారణ జరిగిన నేపథ్యంలో అందుకు అయ్యే ఖర్చును తమిళనాడు ప్రభుత్వం భరించనుంది. దీనికి సంబంధించిన చెల్లింపుల్ని ఇప్పటికే చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తం బంగారు ఆభరణాల్లో 7 కేజీలు నగల్ని అమ్మేందుకు మాత్రం న్యాయస్థానం నో చెప్పింది. మొత్తం 27 కేజీల్లో ఈ ఏడు కేజీలు జయ తల్లి నుంచి పారంపర్య నగలుగా ఉన్నట్లుగా లెక్క తేల్చారు.

ఈ క్రమంలో ఆ బంగారు నగల్ని అమ్మరాదని స్పష్టం చేసిన కోర్టు.. వాటిని జయ వారసురాలికి ఇవ్వాలని సూచన చేశారు. దీంతొ ఈ నగలు ఎవరికి చెందుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జయకు వారసత్వంగా వచ్చిన నగల్ని.. ఆమె మేనకోడలు దీపకు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.