జగదీప్ ధన్ ఖర్...ఇండియా కూటమి మెచ్చుతోంది ఎందుకో ?
ఆయన రాజ్ భవన్ లో ఉంటూ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనను బీజేపీ అగ్రనాయకత్వం మెచ్చి 2022లో అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవికి ఆయన పేరుని ప్రతిపాదించి నెగ్గించారు.
By: Tupaki Desk | 23 July 2025 8:30 AM ISTజగదీప్ ధన్ ఖర్ సీనియర్ నాయకుడు. ఆయనది మూడున్నర దశాబ్దాలకు పైగా సాగిన చట్ట సభల జీవితం. ఆయన 1990 ప్రాంతంలోనే చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలా ఆయన జనతాదళ్ కాంగ్రెస్ దాని నుంచి బీజేపీ లోకి వచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవి ఒక కీలక ఘట్టం. అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ ధన్ ఖర్ అన్నట్లుగా సాగింది.
ఆయన రాజ్ భవన్ లో ఉంటూ అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయనను బీజేపీ అగ్రనాయకత్వం మెచ్చి 2022లో అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవికి ఆయన పేరుని ప్రతిపాదించి నెగ్గించారు. మూడేళ్ళ పదవి కాలం ఆయన సక్సెస్ ఫుల్ గానే పూర్తి చేశారు. కానీ మరో రెండేళ్ళు ఉంది అనగా ఆయన సడెన్ గా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో రాజ్యాంగపరంగా రెండవ అత్యున్నత స్థాయి పదవి అది.
పైగా ఉప రాష్ట్రపతిగా ఉన్న వారు రాజ్యసభ అధ్యక్షుడిగా ఉంటారు. దాంతో మరింత ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ అతి ముఖ్యమైన పదవిని ఆయన ఎందుకు వదులుకున్నారు అన్నదే చర్చగా ఉంది. విపక్షాలు మాత్రం సోమవారం సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఏదో పెద్దదే జరిగి ఉంటుంది. అందుకే ఆయన రాజీనామా చేశారు అని అంటున్నారు.
మరో వైపు జగదీప్ ధన్ ఖర్ రాజీనామా చేసినా ఎన్డీయే పక్షాల నుంచి పెద్దగా స్పందన అయితే రాలేదని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు మాత్రం ఆయనను కొనసాగించేలా చూడాలని కోరాయి. కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ అయితే ప్రధాని మోడీ ఆయనను ఒప్పించి రాజీనామా ఉప సం హరించుకునేలా చూడాలని కోరారు.
ఇవన్నీ పక్కన పెడితే చాలా విషయాలు ఈ విషయంలో పుకార్లుగా షికారు చేస్తున్నాయి అంటున్నారు. సోమవారం యధాప్రకారం ధన్ ఖర్ రాజ్యసభ అధ్యక్షుడిగా తన కార్యకలాపాలను ప్రారంభించారు అని గుర్తు చేసుకుంటున్నారు. అయితే సాయంత్రం నుంచే సీన్ మారింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే సోమవారం రాత్రి పొద్దు పోయాక ఆయన రాజీనామా చేస్తే మంగళవారం ఆయన రాజీనామా ఆమోదం పొందింది. ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అలా ప్రధాని స్పందన ఉంటే విపక్షాలు మాత్రం ఈ ఇష్యూ మీదనే చర్చిస్తున్నాయి.
నిజానికి గత రెండేళ్ళుగా చూస్తే రాజ్యసభలో విపక్షాలకు జగదీప్ ధన్ ఖర్ కి మధ్య సభలో ఘర్షణాత్మకంగానే సాగింది. ఆయన కఠినంగా వ్యవహరిస్తున్నారు అని విమర్శలు చేసేది విపక్షం. కానీ ఇపుడు ఆయన ఇండియా కూటమికి మంచి అయితే ఎన్డీయే నుంచి సౌండ్ పెద్దగా లేదు.
దాంతో ఆయన రాజీనామా వెనక ఏమి జరిగి ఉంటుంది అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే ఆయన తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అన్నది చర్చ సాగుతోంది. ఈ పదవి ఎన్డీయే గెలుచుకోవడం చాలా సులువుగా ఉంది. ఎలక్ట్రోల్ కాలేజ్ లో ఎన్డీయే మిత్రపక్షాలకు సరిపడా బలం ఉంది. దాంతో బీజేపీకి ఈ పదవి ఇస్తారా లేక మిత్రులకు ఇస్తారా అన్నది మరో చర్చ.
బీహార్ లో కొద్ది నెలలలో ఎన్నికలు ఉన్నాయి దాంతో బీహార్ కి చెందిన జేడీయూ నేత రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ అయిన హరివంశ్ నారాయణ్ కే ఈ పదవి ఇస్తారని అంటున్నారు. ఆయన కోసమే ఈ ఖాళీ ఏర్పడిందా అన్నది కూడా చర్చగా ఉంది. మిత్రపక్షంగా ఉన్న జనతాదళ్ కి మేలు చేసేందుకే ఈ పదవిలో కూర్చోబెడతారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. విద్యావంతుడిగా జర్నలిస్టు గా ఉన్న హరివంశ్ నారాయణ్ 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆయనే కొత్త ఉప రాష్ట్రపతి అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
