Begin typing your search above and press return to search.

జగన్ ముందు అద్భుతమైన అరుదైన రికార్డు.. మరి సాధ్యమేనా

భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తండ్రీ కొడుకులు సీఎంలు కావడం అత్యంత అరుదు.

By:  Tupaki Desk   |   30 April 2024 11:30 PM GMT
జగన్ ముందు అద్భుతమైన అరుదైన రికార్డు.. మరి సాధ్యమేనా
X

భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తండ్రీ కొడుకులు సీఎంలు కావడం అత్యంత అరుదు. మహారాష్ట్రలో శంకర్ రావు చవాన్- అశోక్ చవాన్, జమ్ముకశ్మీర్ లో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఒడిసాలో బిజూ పట్నాయక్- నవీన్ పట్నాయక్, యూపీలో ములాయం సింగ్ యాదవ్-అఖిలేశ్ యాదవ్, కర్ణాటకలో దేవెగౌడ-కుమారస్వామి, తమిళనాడులో కరుణానిధి-ఎంకే స్టాలిన్ మాత్రమే ఇలాంటి రికార్డును అందుకున్నారు. ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టి 2019లో వీరి జాబితాలో చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

తెలుగు వారెవరికీ దక్కలేదు..

ఏపీ సహా పలు రాష్ట్రాల్లో తండ్రీ కొడుకులు సీఎంలు అయిన ఉదంతాలు పైన చూశారు కదా. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తండ్రిలాగానే సీఎం అయిన ఘనత మాత్రం ఒక్క వైఎస్ జగన్ కే సొంతం. ఉమ్మడి ఏపీలో పలువురు సీఎంల కుమారులు చురుగ్గా వ్యవహరించినా.. వారెవరూ తదనంతరం సీఎంలు కాలేదు. అయితే, తండ్రి అకాల మరణం అనంతరం రాష్ట్ర విభజనకు ముందే సొంత పార్టీని పెట్టుకున్న జగన్.. 2014లో విభజిత ఏపీకి సీఎం అయ్యే చాన్స్ ను కొద్దిలో కోల్పోయారు. 2019లో మాత్రం ఘన విజయం సాధించారు.

అప్పుడు మిస్ ఇప్పుడు..

నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా మరణం తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ వెంటనే సీఎం అయ్యారు. అయితే, ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు. వీరి మూడు తరాల వారూ సీఎంలు అయ్యారు. అయితే, ఫరూక్ పలుసార్లు సీఎం అయినా షేక్ అబ్దుల్లా తర్వా వరుసగా రెండు సార్లు ఆ పీఠంపై కూర్చోలేకపోయారు. మహారాష్ట్రలో చవాన్ లు, ఒడిశాలో పట్నాయక్ లు, యూపీలో ములాయం-అఖిలేశ్, కర్ణాటకలో దేవెగౌడ-కుమారస్వామి ఇలా ఎవరూ వరుసగా రెండు సార్లు సీఎంలు కాలేదు. కానీ, ఏపీలో జగన్ ముందు మాత్రం ఈ అరుదైన రికార్డు నిలిచింది.

నాన్న 2004, 09లో.. జగనన్న 2019, 24లో?

ఉమ్మడి ఏపీలో 2004లో బంపర్ మెజారిటీతో వైఎస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2009లోనూ ఆయన ఒంటిచేత్తో పార్టీని గెలిపించారు. వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, జగన్ ఆ వెంటనే విభజిత ఏపీలో (2014) ఎన్నికలను ఎదుర్కొన్నా అధికారంలోకి రాలేకపోయారు. 2019లో గెలిచిన ఆయన 2024 ఎన్నికల్లోనూ పవర్ చేజిక్కించుకుంటే వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి తండ్రి రికార్డును సమం చేస్తారు. ఎవరికీ సాధ్యం కాని ఘనతనూ అందుకుంటారు. మరి ఇలా జరుగుతుందా? లేదా? తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.