సాయిరెడ్డి.. చంద్రబాబుకు అమ్ముడు పోయాడు: జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఆ పార్టీ మాజీ నాయకుడు, ఒకప్పుడు ఆయనకు రైట్ హ్యాండ్ మాదిరి గా మెలిగిన వేణుంబాకం విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
By: Tupaki Desk | 22 May 2025 9:28 AMవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఆ పార్టీ మాజీ నాయకుడు, ఒకప్పుడు ఆయనకు రైట్ హ్యాండ్ మాదిరి గా మెలిగిన వేణుంబాకం విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాయిరెడ్డి.. చంద్రబాబుకు అమ్ముడు పోయారని వ్యాఖ్యానించారు. అందుకే రాజ్యసభ సీటుకు ఆయన రాజీనామా చేశారని దుయ్య బట్టారు. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు జగన్పైనా.. వైసీపీ నాయకులపై నా చేసే విమర్శలకు విలువ ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తన మంత్ర దండాన్ని ప్రయోగిస్తున్నారని అన్నారు. వ్యవస్థలను ఆయన మేనేజ్ చూస్తూ.. ప్రశ్నించేవారి గొంతు నొక్కుతున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం అంటూ.. తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇది ఫక్తు రాజకీయ కక్ష సాధింపు చర్యేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వమే లిక్కర్ దుకాణాలను నిర్వహించిందని.. అలాంటప్పుడు లంచాలు ఎవరు ఇస్తారు? ఎవరికి ఇస్తారని జగన్ ప్రశ్నించారు.
తమ హయాంలో మద్యం దుకాణాలను వందకు 33 చొప్పున తగ్గించినట్టు జగన్ చెప్పారు. 2019-2024 మధ్య లిక్కర్ అమ్మకాలు కూడా తగ్గాయని చెప్పారు. పైగా కొత్తగా ఒక్క కంపెనీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదని జగన్ చెప్పారు. పన్నులు కూడా పెంచినట్టు తెలిపారు. అందుకే లిక్కర్ కంపెనీలకు లాభాలు పోలేదన్నారు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచినట్టు చెప్పారు. అదే సమయంలో.. మద్యం తాగడం తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి మేలు చేశామన్నారు.
తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ పలు విషయాలపై చాలా లోతుగా స్పందించారు. లిక్కర్ కుంభకోణం జరిగిందని చెబుతున్నారని.. కానీ, దీనిలో అధికారుల పాత్ర కానీ.. తప్పులు జరిగాయని కానీ చెప్పగలరా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి లిక్కర్కు సంబంధించిన ఒక్క ఫైలైనా వచ్చిందా? అలా వచ్చి ఉంటే నిరూపించాలని సీఎం చంద్రబాబుకు ఆయన సవాల్ రువ్వారు.