ఒకే రోజు బాబు మీద అన్నాచెల్లెళ్ళు
నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా బాబు పాలన ఉందని అన్నారు తిరుపతి లడ్డూలలో కల్తీ ఉందని మొదలెట్టిన బాబు ఆ విషయంలో కూడా రాజకీయమే చేశారు అని విమర్శించారు.
By: Tupaki Desk | 30 April 2025 4:22 PMటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఒకే రోజు అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ విమర్శలతో దాడి చేశారు. ఇద్దరూ కూడా బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విఫలం అయింది అని ధ్వజమెత్తారు. బాబు వరస తప్పిదాలు చేస్తున్నారు అని వైసీపీ అధినేత జగన్ ఘాటు విమర్శలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది అని ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల దీటైన ఆరోపణలు చేశారు.
ఇంతకీ బాబు మీద ఇలా విడివిడిగా అయినా కలివిడిగా అన్నట్లుగా షర్మిల జగన్ ఎందుకు విమర్శలు చేశారు అంటే వారిద్దరూ విపక్షంలో ఉన్నారు. బాబు ప్రభుత్వం తప్పులను వెతకడమే వారి బాధ్యత. ఇక వైసీపీ అధినేత జగన్ సిం హాచలం ఘటనలో ఎనిమిది మంది మరణించిన దాని మీద ఏకంగా విశాఖకు వచ్చి మరీ బాబు సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేశారు.
దేవుడితో రాజకీయాలు చేస్తున్న బాబు ఆలయాలల్లో కనీసం మౌలిక సదుపాయాలను కల్పించడం లేదని విమర్శించారు. భక్తులు ప్రతీ ఉత్సవాలలో చనిపోతున్నారు అన్నారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా బాబు పాలన ఉందని అన్నారు తిరుపతి లడ్డూలలో కల్తీ ఉందని మొదలెట్టిన బాబు ఆ విషయంలో కూడా రాజకీయమే చేశారు అని విమర్శించారు.
ఇక ఈ ఏడాది మొదట్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున తొక్కిసలాటలో భక్తులు ఆరుగురు దాకా మరణించారని గుర్తు చేశారు. ఆ ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్వకపోవడం వల్లనే ఇపుడు సింహాచలం లో ఏకంగా ఎనిమిది మంది బలి అయ్యారని అన్నారు. చందనోత్సవం ఎపుడో తెలిసి కూడా బాబు గోడ కట్టడానికి రెండు రోజుల ముందు దాకా ఆగారు అంటే ఏమనుకోవాలని నిందించారు.
బాబు పాలనలో దేవాలయాలకు భక్తులకు రక్షణ లేదని ఆయన నిందించారు. గోదావరి పుష్కరాలలో ఏకంగా 29 మంది మరణానికి నాటి బాబు ప్రభుత్వం కారణం అన్నారు. ఇలా ఎన్ని జరిగినా విచారణ ఉండదు, కేసులు అసలే ఉండవని ఆయన విమర్శించారు. బాబు పాలనలో పది నెలలకే అనేక వైఫల్యాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక షర్మిల అయితే బాబు ప్రభుత్వం మీద గతంలో కంటే ఎక్కువగా బిగ్గరగా సౌండ్ చేశారు. తాను అమరావతి రాజధాని పర్యటనకు వెళ్తాను అంటే అడ్డుకోవడమేంటి అని నిలదీశారు. తనను హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేసరు. అమరావతి క్యాపిటల్ కమిటీని ఏర్పాటు చేసిన రెండు రోజుల వ్యవధిలోనే తన పర్యటనను అడ్డుకున్నారు అంటే కచ్చితంగా బాబు ప్రభుత్వం బెదురుతోందని ఆమె విమర్శించారు.
అమరావతిలో చంద్రబాబు ఏమి దాచాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. తాను ఒక పార్టీ నాయకురాలిగా అమరావతి వెళ్తే వచ్చిన నష్టమేంటని ఆమె అంటున్నారు ఒక మహిళను పార్టీ నాయకురాలిని ఆపడానికి ఎంతో మంది పోలీసులని పంపించారని ఆమె అంటూ ఇదెక్కడి న్యాయం అన్నారు ఇక తనపైన పోలీసులు చేతులు కూడా వేశారని ఆమె మరో ఆరోపణ చేశారు. మొత్తానికి జగన్ ఊసు లేకుండా బాబుని టార్గెట్ చేస్తూ షర్మిల తొలిసారి ఈ విధంగా మీడియా ముందుకు వస్తే బాబు మీద పదునైన విమర్శలతో జగన్ విశాఖలో తన దూకుడు చూపించారు. ఇలా ఒకే రోజు అన్నాచెళ్ళెళ్లు ఇద్దరూ బాబునే టార్గెట్ చేయడం విశేషం.