రావణ్ కేసులో యూటర్న్.. సంబంధం లేదంటున్న న్యాయవాది!
నిన్న మొన్నటి వరకు యూట్యూబర్ రావణ్ను వెనుకేసుకువచ్చి.. ఆయనకు మద్దతుగా మాట్లాడిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు.
By: Garuda Media | 12 July 2026 12:06 AM ISTనిన్న మొన్నటి వరకు యూట్యూబర్ రావణ్ను వెనుకేసుకువచ్చి.. ఆయనకు మద్దతుగా మాట్లాడిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. రావణ్ చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, అసలు ఆయనను గెస్టుగా కూడా తాను పిలవలేదని తెలిపారు. పిలవని పేరంటానికి వచ్చి.. రచ్చ చేశాడని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రావణ్ చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
అసలు ఏం జరిగింది?
ఏలూరులో గత నెలలో జడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో భారీ సభను నిర్వహించారు. ఈ సభలోనే రావణ్.. నోటికి పనిచెప్పాడు. డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పై నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించాడు. దీంతో జనసేన అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు రావణ్ పై కేసులు పెట్టారు తాజాగా అసలు సభకు అనుమతి ఎవరు ఇచ్చారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో తన మెడకు ఉచ్చు బిగుసుకుంటోందని భావించిన జడ శ్రవణ్ అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది.
ఆది నుంచి రావణ్ను వెనుకేసుకువచ్చిన వారిలో జడ శ్రవణ్ ఉన్నారు. రావణ్పై కేసులు పెట్టడం అంటే.. భావ ప్రకటనా స్వేచ్ఛను బందీ చేయడమేనని వ్యాఖ్యానించిన ఆయన.. కోర్టులోనూ రావణ్కు అనుకూలంగా వాదనలు వినిపించారు. ఎప్పుడైతే.. ఏలూరు సభ వ్యవహారం తెరమీదికి వచ్చిందో వెంటనే ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇలాంటి కేసుల్లో సభా నిర్వాహకులకు కూడా బాధ్యత ఉంటుందని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే జడ శ్రవణ్పై కేసులు పెట్టేందుకు పోలీసులు పరిశీలిస్తున్నారు.
``సభకు నేను ఆహ్వానించిన వారు రాలేదు. ఎవరికైతే ఆహ్వానం పంపలేదో వారు వచ్చారు. నాకంటే ముందుగానే వచ్చి.. వేదికపై కూర్చున్నారు. పైగా రావణ్ అలా మాట్లాడతాడని నేను మాత్రం ఊహించానా? ఆయన చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. రావణ్పై ఎలాంటి కేసులైనా పెట్టవచ్చు`` అని శ్రావణ్ తెలిపారు. మరోవైపు.. వైసీపీ లీగల్ సెల్ ఎంట్రీ ఇవ్వడంతో తనకు దక్కాల్సిన మైలేజీ పోతోందన్న ఆవేదనతోనే జడ ఇలా యూటర్న్ తీసుకున్నారన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా దుర్భాషలకు, నోటి దురుసు వ్యక్తులకు మద్దతు ఇస్తుండడం పట్ల స్థానికంగా వ్యతిరేక త కూడా పెరుగుతోంది.
