ఈ దాడులు ఇరాన్ కు జుజుబి... అమెరికా ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్!
దీంతో... ఇప్పట్లో ఇరాన్ తేరుకోవడం కష్టమే అని, ఇకపై ఆ దేశం అణ్వాయుధాల తయారీ విషయంలో తొందరపడకపోవచ్చని కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 25 Jun 2025 12:11 PM ISTపశ్చిమాసియాలో ప్రస్తుతం వాతావరణం కాస్త ప్రశాంతంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరిగిన భీకర యుద్ధం 12వ రోజు శాంతించింది. ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది.. ఖతర్ లో తాము ఎయిర్ బేస్ పై చేసిన దాడులతో వణికిన అమెరికా కాళ్ల బేరానికి వచ్చి, ఇజ్రాయెల్ ను బలంవంతంగా సీజ్ ఫైర్ కి ఒప్పించిందని ఇరాన్ చెప్పుకుంది.
ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓటమిపాలయ్యారు అనేది కాదు.. ఫైనల్ గా శాంతి గెలిచింది, శాంతి నిలిచింది, అది తనవల్లే సాధ్యమైంది అనేస్థాయిలో ట్రంప్ స్పందిస్తున్నారు. సీజ్ ఫైర్ ఉల్లంఘించినట్లు వార్తలొస్తే బూతులు మాట్లాడుతున్నారు! మరోవైపు... ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యం నెరవేరిందని, ఇరాన్ కు అణ్వాయుధాలు చేసే సామర్థ్యం పోయిందని ఇజ్రాయెల్ చెప్పుకుంది.
దీంతో... ఇప్పట్లో ఇరాన్ తేరుకోవడం కష్టమే అని, ఇకపై ఆ దేశం అణ్వాయుధాల తయారీ విషయంలో తొందరపడకపోవచ్చని కథనాలొస్తున్నాయి. అయితే... ఈ యుద్ధంలో ఇరాన్ కు జరిగిన నష్టం జుజుబి అనీ.. అది పెద్ద తీవ్రమైనది కాదని.. మరో కొన్ని నెలల్లో ఇరాన్ విల్ బీ బ్యాక్ అంటున్నాయి నివేదికలు. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. అయితే.. ఈ దాడుల్లో ఇరాన్ కు జరిగిన నష్టం గురించి పెంటగాన్ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఓ నివేదిక తయారుచేసింది.
దీంతో... ఈ నివేదికలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ప్రధానంగా... ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ కు పరిమితమైన నష్టం మాత్రం వాటిల్లిందని అందులో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కొన్ని నెలల్లోనే తన కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేసుకోవచ్చని తెలిపింది!
వాస్తవానికి... ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అనే అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనం అయ్యాయని ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ దాడుల్లో ఫోర్డో, నతాంజ్ లు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది.
ఫలితంగా... యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్ లు వంటి కీలక పరికరాలను ఇరాన్ తిరిగి కొన్ని నెలల్లోనే ప్రారంభించుకోవచ్చని తెలిపింది. దీంతో... ఈ విషయాలపై ట్రంప్ స్పందించారు. అవి పూర్తిగా నకిలీ వార్తలని పేర్కొన్నరు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఇదని అన్నారు.
ఇదే సమయంలో... ఇలాంటి ఆరోపణలతో కూడిన నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ ను కించపరచడమేనని.. 30 వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసని.. అవన్నీ మొత్తం ధ్వంసం అయ్యాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ 'ఎక్స్'లో పేర్కొన్నారు.
