పశ్చిమాసియాలో భీకర యుద్ధం: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య క్షిపణి దాడులు, విస్తరిస్తున్న ఉద్రిక్తతలు
గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో ఇరాన్పై పెద్దఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది.
By: Tupaki Desk | 14 Jun 2025 3:08 PM ISTపశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు దేశాలు మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. జనాలపై బాంబులు కురుస్తున్నాయని, జెరూసలేం వంటి పవిత్ర నగరాలు కూడా దాడులకు గురవుతున్నాయని తెలుస్తోంది.
-ఇజ్రాయెల్ 'ఆపరేషన్ రైజింగ్ లయన్' దాడులు:
గురువారం అర్ధరాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో ఇరాన్పై పెద్దఎత్తున వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్లోని అణ్వాయుధ కేంద్రాలు, మిలిటరీ స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేనేజర్ జనరల్ హోస్సేన్ సలామీసహా పలువురు కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు మృతిచెందారు. ఈ దాడుల్లో మొత్తం 78 మంది పౌరులు మరణించగా, 329 మంది గాయపడినట్లు సమాచారం.
-ఇరాన్ ప్రతీకార దాడులు:
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం శనివారం తెల్లవారుజామున క్షిపణులతో దాడులు చేసింది. ఇరాన్ క్షిపణులు, రాకెట్లు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ ను తాకాయి. ఇజ్రాయెల్లోని రెండు అతిపెద్ద నగరాలైన జెరూసలేంపై కూడా మిసైల్ దాడులు జరిగాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల దాడిని చురుగ్గా అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. అనేక నగరాల్లో వైమానిక దాడుల సైరన్లు మోగాయి. టెల్ అవీవ్లో ఇరాన్ దాడుల కారణంగా దాదాపు 35 మంది గాయపడినట్లు సమాచారం. జెరూసలేంలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
-టెహ్రాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడి:
శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ టెహ్రాన్పై మరోసారి మిసైళ్ల దాడికి పాల్పడింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, రెండు క్షిపణులు మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని తాకాయి. ఈ ప్రాంతంలోనే ఫైటర్ జెట్లు, రవాణా విమానాలను కలిగి ఉన్న వైమానిక దళ స్థావరం కూడా ఉంది. ఈ ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెహ్రాన్లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతోపాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కూడా ఉంది.
-ఇరాన్ మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీ
ఇజ్రాయెల్ క్షిపణుల దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందాడు. యుద్ధం మొదలైన నేపథ్యంలో ఆఘమేఘాలపై అతని స్థానంలో ఇరాన్ కొత్త మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించినట్లు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తెలిపారు. ఇది యుద్ధ వాతావరణంలో ఇరాన్ తీసుకున్న కీలక నిర్ణయం.
ఈ పరిణామాలు పశ్చిమాసియాలో మరింత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధం మరింత పెద్దది కాకుండా ఆపేందుకు ప్రయత్నించాలని కోరుతున్నాయి.