ఇరాన్ ఇంటెన్షన్ క్లియర్... 'ఐఏఈఏ'పై కీలక నిర్ణయం!
ఈ నేపథ్యంలో... ఇరాన్ పార్లమెంట్ ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేసింది. అయితే... ఆ దేశ సుప్రీం నేషనల్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది.
By: Tupaki Desk | 25 Jun 2025 4:00 AM ISTఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. వాటివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఆ దేశంలోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు అంటూ ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించింది. అనంతరం... కొన్ని కీలక అణుకేంద్రాల విషయంలో తమ పెర్ఫార్మెన్స్ అవసరం ఉందని గ్రహించిన అమెరికా.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అంటూ ఫినిషింగ్ ఇచ్చింది.
దీంతో.. పశిమాసియాలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య మొదలైన భీకర యుద్ధం 12వ రోజు ముగిసింది. దీంతో.. ఇకపై ఇరాన్ కు అణ్వాయుధాలు తయారు చేసే అవకాశం లేదని, వారి సామర్థ్యాలను అణిచివేశామని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ ప్రకటించుకున్నాయి. మరోవైపు ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరగడాన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ స్వాగతించింది.
ఇదే సమయంలో... ఈ యుద్ధం జరిగినన్ని రోజులు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్ స్పెక్టర్లు ఇరాన్ లోనే ఉన్నారు. ఏది ఏమైనా ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 24 గంటల్లోనే ఇరాన్ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా... ఇక మీదట అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో... ఇరాన్ పార్లమెంట్ ఈ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేసింది. అయితే... ఆ దేశ సుప్రీం నేషనల్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలిబాఫ్... ఇరాన్ అణు కేంద్రాలపై దాడులను ఖండించడానికి ఐఏఈఏ నిరాకరించింది. దీంతో విశ్వసనీయతను వేలానికి పెట్టినట్లైంది అని అన్నారు.
కాగా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో ఎవరూ ఊహించని రీతిలో అన్నట్లుగా సడన్ ఎంట్రీ ఇచ్చిన అమెరికా.. బాంబర్ విమానాలతో టెహ్రాన్ లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై భారీ ఎత్తున దాడి చేశాయి. ఈ క్రమంలో అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. అయితే... ఈ దాడుల్లో ఆ కేంద్రాలు ఏమేరకు దెబ్బతిన్నాయనేదానిపై పూర్తి క్లారిటీ రాలేదు.
అయితే... అమెరికాలోని కొన్ని పత్రికలు మాత్రం ఫోర్డో కేంద్రం స్వల్పంగానే దెబ్బతిన్నట్లు చెబుతున్నాయి. మరోపక్క ట్రంప్ మాత్రం... ఇరాన్ పై దాడితో ఆ దేశ అణుస్థావరాలపై చెప్పుకోదగిన స్థాయిలో నష్టం జరిగిందని అన్నారు.
