Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచారా? లేదా? చెప్పండి: తెలంగాణ హైకోర్టు

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ హైకోర్టు తీసుకునే నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మార‌నుంది.

By:  Tupaki Desk   |   23 March 2024 3:00 AM GMT
ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచారా?  లేదా?  చెప్పండి:  తెలంగాణ హైకోర్టు
X

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచారా? లేదా? చెప్పండి అని ప‌లువురు ఎమ్మెల్యేల‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన దానం ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న తాజాగా కాంగ్రెస్ గూటికి చేరిపోవ‌డంతోపాటు.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టికెట్ కూడా ద‌క్కించుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజా ఆదేశాల‌తో ఆయ‌న ఇరుకున‌ప‌డిన‌ట్ట‌యింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ హైకోర్టు తీసుకునే నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మార‌నుంది.

ఏం జ‌రిగింది?

దానం ఎన్నిక రద్దు చేయాలంటూ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టారని.. డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే, ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని చెప్పారు. ఈ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.

అదేవిధంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోవాలక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనంనేని సాంబశివరావు, మధుసూదన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. వీరంతా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్స్ సమర్పించారని హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీరిపైన కూడా సేమ్ టు సేమ్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో వీరికి కూడా హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నిక‌ల‌లో సొమ్ములు పంచ‌డాన్ని తీవ్రంగా భావిస్తున్న‌ట్టు కోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో వైపు వేలాడుతున్న క‌త్తి

ఇదిలావుంటే.. గ‌త ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గ‌తంలో 2009, 2018లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు. దీంతో మ‌రోవైపు దానం నాగేందర్ పై బీఆర్ఎస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని కోరారు.