'నేనెందుకు ఏడవడం లేదో తెలియడం లేదు'...ఛీర్ లీడర్ వీడియో వైరల్!
తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్ లో తొలిసారిగా ఓ మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేశారు.
By: Tupaki Desk | 9 May 2025 1:23 PM ISTభారత్ - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో చాలా లెక్కలు మారిపోతున్నాయి. ఈ సమయంలో... భారత్ లో జరుగుతున్న ఐపీఎల్, పాక్ లో జరుగుతున్న పీ.ఎస్.ఎల్ లకు సమస్యలు వచ్చి పడ్డాయి. ఇందులో భాగంగా... పీ.ఎస్.ఎల్.ను పూర్తిగా యూఏఈ కి మార్చుతున్నట్లు చెబుతోన్న వేళ.. ఇటు భారత్ లోనూ ఐపీఎల్ మ్యాచ్ లకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇందులో భాగంగా... తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్ లో తొలిసారిగా ఓ మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేశారు. ధర్మశాల వేదికగా మొదలైన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దైంది. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
ప్రధానంగా గురువారం రాత్రి జమూ కశ్మీర్, పోఠాన్ కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్ లతో దాడులు చేసేందుకు ప్రయత్నించడంతోనే ముందస్తు చర్యల్లో భాగంగా ఆటను నిలిపేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ప్రేక్షకులు మొదలైన వారు మైదానాన్ని ఖాళీ చేస్తున్న క్రమంలో ఓ ఛీర్ లీడర్ వీడియో వైరల్ గా మారింది.
అవును... ధర్మశాలలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను భద్రతాకారణాతో మధ్యలోనే రద్దు చేయడంతో.. అంతా మైదానాన్ని ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఓ ఛీర్ లీడర్... మ్యాచ్ రద్దు ప్రకటన వచ్చిన సమయంలో బాంబులు వస్తాయేమోనని అంతా అరుస్తూ బయటకు వెళ్లిపోయారని.. ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉందని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే... తాను ఎందుకు ఏడవడం లేదనేది తెలియడం లేదు కానీ.. ఇప్పటికే షాకులోనే ఉన్నట్లు ఆమె చేసిన వ్యాఖ్యలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.