191 మందితో ఢిల్లీ - గోవా ఇండిగో విమానంలో "పాన్ పాన్ పాన్" కాల్.. ఏమిటిది?
అవును... ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:53 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
By: Tupaki Desk | 17 July 2025 9:52 AM ISTఇటీవల పలు విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్ర్మంలో తాజాగా ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానంలోని ఇంజిన్ లో సమస్య తలెత్తింది. దీంతో... ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని ముంబై విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఆ విమానంలో 191 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.
అవును... ఢిల్లీ నుండి గోవాకు వెళ్తున్న ఇండిగో విమానం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:53 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గోవా విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా... విమానం భువనేశ్వర్ కు ఉత్తరాన 100 నాటికల్ మైళ్ల దూరంలో ఎగురుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని అధికారులు తెలిపారు. "ఇంజిన్ నంబర్ 1 లో లోపం కారణంగా పైలట్ "పాన్ పాన్ పాన్" అని ప్రకటించాడు. దీంతో.. విమాన సిబ్బంది ముంబైకి మళ్లింపును అభ్యర్థించారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇండిగో ప్రతినిధి... జూలై 16, 2025న ఢిల్లీ నుండి గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎగురుతున్నప్పుడు 6ఈ 6271 విమానంలో సాంకేతిక లోపం కనుగొనబడిందని.. దీంతో, విమానాన్ని దారి మళ్లించి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
ఏమిటీ పాన్ పాన్!:
'పాన్ పాన్ పాన్' అనేది పైలట్లు శ్రద్ధ వహించాల్సిన అత్యవసర పరిస్థితిని సూచించడానికి ఉపయోగించే రేడియో డిస్ట్రెస్ కాల్. అయితే ఇది 'మేడే' కాల్ అంత తీవ్రంగా ఉండదు. ఈ కాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి విమానం మెయింటినెన్స్ అవసరమయ్యే సమస్యను ఎదుర్కొంటోందని తెలియజేస్తుంది. పరిస్థితి తీవ్రంగా ఉందని కానీ ఇంకా క్లిష్టంగా లేదని ఈ కాల్ సూచిస్తుంది.
