150 కోట్లమంది సాధించింది సున్నా.. భారత్ పై అమెరికా ఇన్ఫ్లుయెన్సర్
ఒక్కోసారి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఏం మాట్లాడతారో వారికే తెలియదు... సమాజంలో కాస్త గుర్తింపు రాగానే నోరు జారుతుంటారు..
By: Tupaki Desk | 22 Aug 2025 11:00 PM ISTఒక్కోసారి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ఏం మాట్లాడతారో వారికే తెలియదు... సమాజంలో కాస్త గుర్తింపు రాగానే నోరు జారుతుంటారు.. తామేదో గొప్ప అన్నట్లు భావిస్తుంటారు... అది ఏ దేశం వారు అయినా కానీ.. ఇలానే ఓ అమెరికా ఇన్ ఫ్లుయెన్సర్ భారత్ గురించి నోరు జారాడు. వివాదాస్పద పోస్ట్ పెట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.
కళ్ల ముందు చరిత్ర కనిపిస్తున్నా..
ఆయన పేరు చార్లెస్ హేవుడ్. అమెరికన్ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్. తాజాగా అతడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశం సాధించింది సున్నా.. అంటూ పోస్ట్ పెట్టి అభాసు పాలయ్యాడు. ఆధునిక యుగంలో భారతీయులు చెప్పుకోదగ్గట్లుగా సాధించినది ఏమీ లేదన్నాడు. దీంతో వెంటనే నెటిజన్లు ఫైర్ అయ్యారు. సాక్షాత్తు గత ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ను కళ్లెదుట పెట్టుకుని ఇంత మాట అంటాడా? అంటూ నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో టెక్నాలజీ, సైన్స్, లిటరేచర్, బిజినెస్ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను గుర్తుచేశారు.
ఒకే గాటన కట్టేస్తూ...
చరిత్ర తెలియకనో, లేక అవగాహనా రాహిత్యంతోనో.. హేవుడ్ వంటివారు అన్ని అంశాలను ఒకే గాటన కట్టేస్తుంటారు. తాము మాట్లాడే విషయం ఎక్కడివరకు వెళ్తుందో గ్రహించే శక్తి, ఆలోచన కూడా వీరికి ఉండదు. అందుకే హేవుడ్ భారత్ గురించి అవాకులు చెవాకులు పేలాడు. ఇందులో కూడా భారతీయులు ఏం సాధించారో
గ్రోక్ (ఏఐ టూల్) కూడా చెప్పలేదు అంటూ మరింత చెత్త వాగుడు వాగాడు. 150 కోట్ల మంది ఉండడంతో మనం కొంత రాజీ పడాల్సి వస్తోంది అంటూ కూశాడు.
ఇంటర్నెట్ ఊగిపోయింది...
హేవుడ్ చెత్త వాదనతో ఇంటర్నెట్ ను భారతీయులు షేక్ చేశారు. భారతీయులు కానివారు కూడా హేవుడ్ ట్వీట్ ను అతడి పిచ్చితనం అంటూ కొట్టి పారేశారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు సీఈవోలు, నోబెల్ బహుమతి విజేతలు, వైద్యులు, శాస్త్రవేత్తలు, మేధావులతో కూడిన భారత సంతతి వివిధ దేశాల్లో సత్తాచాటుతున్న సంగతిని గుర్తుచేశారు.
అసలు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు..?
నీ ఉద్దేశం ఏమిటి మిస్టర్ హేవుడ్..?? మీరు దేశాలను, రాజకీయాలను, విధానాలను విమర్శించవచ్చు కానీ.. మొత్తం ప్రజలను తప్పుబడతారా? అంటూ నెటిజన్లు అతడిని ఓ ఆట ఆడుకున్నారు. ఆధునిక దేశంగా అవతరించడంలో భారత్ ప్రయత్నాలు సాగిస్తోందని, కొన్ని సమస్యలున్నా.. పూర్తిగా తీసిపారేస్తారా? అంటూ ప్రశ్నించారు.
-ప్రపంచ శక్తిమంతమైన, అమెరికా కేంద్రంగా పనిచేసే గూగుల్, మైక్రోసాఫ్ట్, పెప్సికో, ఎక్స్ (పూర్వం ట్విటర్)లకు సీఈవోలుగా ఉన్న, గతంలో బాధ్యతలు నిర్వర్తించినవారు భారతీయులని గుర్తుచేశారు.
-కొవిడ్ 19కు టీకాలు కనిపెట్టిన శాస్త్రవేత్తలు, సైన్స్ లో పెద్ద ఎత్తున పరిశోధనలు సాగించినవారు, అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నవారు, చంద్రయాన్-3 వంటివన్నీ భారత్ సాధించిన విజయాలు కాదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలను అందించింది భారత దేశం కాదా? అని హేవుడ్ ను నిలదీశారు.
-ఇక హేవుడ్ ట్వీట్ పెట్టిన వెంటనే ట్రోలింగ్ ప్రారంభమైంది. నువ్వ పెట్టిన ట్వీట్ ఒకప్పుడు భారత సంతతి వ్యక్తి సీఈవోగా ఉన్న సంస్థ అని ఎగతాళి చేశారు.
-మా భారతీయులు ఏమీ సాధించలేదా? అంటూ నేనైతే గ్రోక్ ను అడిగాను.. గూగుల్ సీఈవో పిచయ్ సహా అది ఓ డజను మంది వివరాలు ఇచ్చింది అని ఓ నెటిజన్ వెటకారం ఆడాడు.
