Begin typing your search above and press return to search.

'నో ఫియర్' జాకెట్లు, ఏకే 47 తుపాకులు..పాక్‌లో జ్యోతి మల్హోత్రాకు ఎందుకంత భద్రత?

సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

By:  Tupaki Desk   |   26 May 2025 3:02 PM IST
నో ఫియర్ జాకెట్లు, ఏకే 47 తుపాకులు..పాక్‌లో జ్యోతి మల్హోత్రాకు ఎందుకంత భద్రత?
X

సోషల్ మీడియాలో ఒక యూట్యూబర్ వీడియో ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఒక భారతీయ యూట్యూబర్‌కు ఏకంగా ఏకే 47 తుపాకులతో భద్రత కల్పించారు. అసలే పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టయిన హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో ఈ వీడియో మరింత సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్‌లో పర్యటించినప్పుడు తీసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో, ఆమె కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఒక సామాన్య యూట్యూబర్‌కు అంత భారీ భద్రత ఎందుకు కల్పించారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియోను ఒక స్కాటిష్ యూట్యూబర్ అయిన క్యాలమ్ మిల్ తన పాకిస్థాన్ పర్యటనలో భాగంగా తీశాడు. లాహోర్‌లోని అనార్కలి బజార్‌లో క్యాలమ్ మిల్ వీడియోలు తీస్తుండగా, అనుకోకుండా జ్యోతి మల్హోత్రా అతనికి తారసపడింది. క్యాలమ్ మిల్ తనను స్కాటిష్ యూట్యూబర్‌గా పరిచయం చేసుకోగా, జ్యోతి తాను భారత్ నుంచి వచ్చానని తెలిపింది. పాకిస్థాన్ ఆతిథ్యం గురించి క్యాలమ్ అడగగా, చాలా బాగుంది అని జ్యోతి సమాధానం ఇచ్చింది.

జ్యోతి ముందుకు వెళ్తుండగా, క్యాలమ్ మిల్ ఒక షాకింగ్ దృశ్యాన్ని చూశాడు. ఆరుగురు వ్యక్తులు సాధారణ దుస్తుల్లో ఏకే 47 తుపాకులతో జ్యోతి మల్హోత్రాకు భద్రత కల్పిస్తున్నారు. వారి జాకెట్లపై నో ఫియర్ అని రాసి ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన క్యాలమ్, తన అభిమానులను ఉద్దేశించి, ఒక యూట్యూబర్‌కు ఇంత భారీ భద్రత ఎందుకు? అని ప్రశ్నించాడు. ఈ వీడియో బయటపడిన తర్వాత జ్యోతి కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె చుట్టూ ఇతర పర్యాటకులు కూడా ఉన్నందున, ఆయుధాలు ధరించినవారు జ్యోతికి మాత్రమే భద్రత కల్పించారా, లేక ఆమెతో ఉన్న బృందం మొత్తానికీ భద్రత ఇచ్చారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

జ్యోతి మల్హోత్రాపై జరుగుతున్న గూఢచర్యం దర్యాప్తులో అధికారులు పలు కీలక విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలు ఉన్నాయని జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేసే డానిష్‌తో తాను నిత్యం టచ్‌లో ఉండేదాన్నని జ్యోతి వెల్లడించింది. 2023లో వీసా కోసం పాకిస్థాన్ హైకమిషన్‌కు వెళ్ళినప్పుడు తొలిసారి డానిష్‌తో పరిచయం అయినట్లు ఆమె చెప్పింది. వీసా కోసం పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయానికి వచ్చే అమాయకులను డానిష్ ట్రాప్ చేసి, వారిని గూఢచర్యానికి వాడుకునేవాడని అధికారులు వివరించారు. జ్యోతి కూడా వీసా కోసం వెళ్ళినప్పుడు ఆమెను ట్రాప్ చేశారని అనుమానిస్తున్నారు. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో కూడా జ్యోతి పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంగా, ఈ గూఢచర్యం కేసులో జ్యోతి మల్హోత్రా పాత్ర, ఆమె పాకిస్థాన్ ప్రయాణం, ఆమెకు లభించిన అసాధారణ భద్రత అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.