ప్రియమైన భారతీయ పౌరులారా....దయచేసి అలా చేయకండి !
ఫోటోలు వీడియోలు ప్రతీ వారూ తీసేసి సోషల్ మీడియాలో పెడుతూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
By: Tupaki Desk | 9 May 2025 6:24 PM ISTయుద్ధం అంటే చాలా వ్యూహాలు ఉంటాయి. శతృవు ఆదమరచి ఉన్నపుడు దెబ్బకొట్టడం ఇందులో చాణక్య నీతి. అలాగే దెబ్బ పడేవరకూ ఎంత మౌనంగా లౌక్యంగా ఉండాలో కూడా తెలిస్తేనే అది యుద్ధ నీతి అవుతుంది. ఇపుడు చూస్తే టెక్నాలజీ యుగంలో అంతా ఉన్నారు. ఏదీ ఎక్కడా దాగడం లేదు.
ఫోటోలు వీడియోలు ప్రతీ వారూ తీసేసి సోషల్ మీడియాలో పెడుతూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే అన్నీ ఒక ఎత్తు ఆర్మీకి చెందిన విషయాలు వారి కదలికలు రహస్యాలు వారి యుద్ధ నీతి వంటివి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల దుర్గార్గమైన దాయాదికే మేలు చేసిన వారు అవుతారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అతి ఉత్సాహం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు.
పాక్ ఎంతలా చితికిపోయినా పౌరులకి యుద్ధ నీతి మీద పూర్తి అవగాహన ఉంది. తమ సీక్రేట్స్ వారు ఎప్పటికీ సోషల్ మీడియాలో పంచుకోరు అక్కడ సైన్యం లో ఉన్న పట్టుదల సాధారణ పౌరులలో కూడా ఉంటుంది. అంతా ఈ విషయంలో ఏక త్రాటి మీద ఉంటారు. దానికి కారణం పాక్ పేరుకు ప్రజాస్వామ్యం ముసుగు తొడుక్కున్నా సైనిక పాలనలో ఉన్నట్లే అనుకోవాలి.
అయితే భారత్ లో ప్రజాస్వామ్యం ఉంది. ఎంతలా అంటే పహల్గాం ఉగ్ర దాడి జరిగినా కూడా యుద్ధం తప్పు అని వ్యాఖ్యానించే శాంతిదూతలు ఇక్కడే కనిపిస్తారు. ఇక ఇవి చాలదన్నట్లుగా సోషల్ మీడియాలో యుద్ధానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను పెడుతున్నారు. దాంతో అసలైన ఇబ్బంది భారతదేశానికి వస్తోంది.
దీంతో ఈ విషయం మీద ఏకంగా భారత ఆర్మీ భారత పౌరులను ఉద్దేశించి ఒక విన్నపం చేసింది. అదేంటి అంటే భారత్ పాక్ ల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవి ఆఫీసర్లకు సంబంధించిన విమానాలు, వాహనాలు, హెలికాప్టర్లు ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు వెళుతున్న సమయంలో దయచేసి పౌరులు ఎవరు తమ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీయవద్దంటూ వినయపూర్వకంగా వినతి చేసింది. ఒకవేళ వీడియోలు తీసినా వాటిని సోషల్ మీడియాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయవద్దు అంటూ పేర్కొంది.
దీని వల్ల దాయాది పాక్ కే మేలు జరుగుతుందని ఇది అందరూ గురించి తమ దేశభక్తిని ఈ క్లిష్టమైన సమయంలో చాటుకోవాలని కోరింది. ఇలా పోస్టు చేసినవి సామాజిక మాధ్యమాలలో కనుక వైరలై శత్రుదేశానికి తెలిస్తే మనకు తెలియకుండానే పాకిస్తాన్కు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామని ఆర్మీ పేర్కొంది. అందువల్ల దయచేసి ఈ పని మాత్రం చేయవద్దు అంటూ ఇండియన్ ఆర్మీ భారతదేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.
ఈ విధంగా భారత ఆర్మీ చేసిన ఈ విన్నపాన్ని అంతా అర్ధం చేసుకుని దేశం హితం కోసం పనిచేయాలని అంతా కోరుతున్నారు సరిహద్దులలో ప్రాణాలకు తెగించి దేశం కోసం ఎంతగానో పోరాడుతున్న భారత సైనికుల కోసం ఈ మాత్రం చేయలేమా అని ప్రతీ పౌరుడూ ఆలోచించాల్సిన సమయం ఇది. అంతే కాదు ఆర్మీ చెప్పినట్లు విని ప్రతీ ఒక్కరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా ఉండడం చాలా మంచిది అని అంటున్నారు. దేశ భక్తి అంటే ఇదే మరి. ఈ విధంగా పాటించడం వల్ల ఇండియాకు ప్రతీ పౌరుడు తానుగా ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారని అంతా అంటున్నారు.