శ్రీలంక పొరుగు దేశం.. అయినా ఇండియా మ్యాప్ లో కనిపించేందుకు కారణం ఇదే..
భారత్ కు శ్రీలంకకు విడదీయలేని బంధం ఉంది. చారిత్రక పరంగా.. పురాణాల పరంగా.. భౌగోళిక పరంగా ప్రతి విషయంలో శ్రీలంక భారత్ కు చెందిందే.
By: Tupaki Desk | 20 Sept 2025 5:00 PM ISTభారత్ కు శ్రీలంకకు విడదీయలేని బంధం ఉంది. చారిత్రక పరంగా.. పురాణాల పరంగా.. భౌగోళిక పరంగా ప్రతి విషయంలో శ్రీలంక భారత్ కు చెందిందే. రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికీ లంక తెలుసు. ఇక ఆ స్టోరీ చెప్పుకుంటే చాలా పెద్దగా అవుతుంది. ఇక భౌగోళికంగా చూసుకుంటే లక్షలాది, కోట్లాది సంవత్సరాలకు ముందు ఇండియాకు ఆనుకొని ఉన్న భాగం. సముద్ర నీటి కోతతో కొంచెం దూరంగా జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. పైగా శ్రీరాముడు శ్రీలంకకు వానరులతో కట్టించిన వారధి ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు శ్రీలంక పొరుగు దేశం.
భారత మ్యాప్ లో ఎప్పుడూ ఉంటుంది..
భారతదేశం మ్యాప్ను మనం పాఠశాలలో, పత్రికల్లో, వార్తల్లో, అధికారిక పత్రాలలో అనేకసార్లు చూసే ఉంటాం. ఈ మ్యాప్లో మన భూసరిహద్దు దేశాలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ అన్నీ గుర్తించబడతాయి. భారత మ్యాప్ లో ఒక ప్రత్యేకత ఎప్పుడూ కనిపిస్తుంది. అదే దక్షిణ దిశలో సముద్రం అవతల ఉన్న చిన్న ద్వీప దేశం శ్రీలంక. ఇది భారత మ్యాప్ లో తప్పనిసరిగా సూచించబడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు.. అంతర్జాతీయ చట్టాలే ఇలా ఉండేందుకు కారణం.
సముద్ర చట్టం ప్రభావం
1982లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ (United Nations Convention on the Law of the Sea-UNCLOS) దేశాలకు సముద్ర సరిహద్దులపై స్పష్టమైన హక్కులు, బాధ్యతలు నిర్ధేశించింది. ఈ ఒప్పందం ప్రకారం.. ఒక దేశం తీరప్రాంతం నుంచి 200 నాటికల్ మైళ్లు (సుమారు 370 కిలో మీటర్లు) దూరం వరకూ విస్తరించే ప్రాంతం దాని ఎక్స్క్లూజిబ్ ఎకానమిక్ జోన్ (Exclusive Economic Zone-EEZ) గా పరిగణిస్తారు. ఈ పరిధిలోని జలాలు, ద్వీపాలు, సహజ వనరులు ప్రత్యేకంగా కేటాయిస్తారు. అంటే భౌగోళికంగా దగ్గరలో ఉన్న ప్రాంతాలను మ్యాప్లో చూపించడం కేవలం సమాచారం కోసం కాదు అది చట్టపరమైన నిబంధన.
భారత్–శ్రీలంక మధ్య దూరం
భారతదేశం నుంచి శ్రీలంక మధ్య దూరం కేవలం 18 నాటికల్ మైళ్లు మాత్రమే.. అంటే సుమారు 55 కిలో మీటర్లు. ఈ కారణంగానే శ్రీలంక పూర్తిగా భారత EEZ పరిధిలోకి వస్తుంది. అందువల్ల భారత్ తన అధికారిక మ్యాప్లో శ్రీలంకను తప్పనిసరిగా చూపించాలి. ఇది కేవలం సముద్ర సరిహద్దుల స్పష్టతకే కాదు.. సముద్ర వనరుల వినియోగంలో భారత్కు ఉన్న హక్కులను కూడా సూచిస్తుంది.
చట్టపరమైన, రాజకీయ ప్రాధాన్యం
ఈ నిబంధనతో భారతదేశం–శ్రీలంక మధ్య సంబంధాలు భౌగోళికంగా మరింత బలంగా ఉంటాయి. సముద్ర వనరులు, మత్స్యకారుల హక్కులు, నౌకా రవాణా మార్గాలు అన్నీ ఈ రెండు దేశాల మధ్య పరస్పర సంబంధాలపై ఆధారపడుతాయి. అందువల్లే మ్యాప్లో శ్రీలంక ఉనికి ఒక చిహ్నం మాత్రమే కాదు.. అది రెండు దేశాల భవిష్యత్తు సహకారానికి సూచిక. ఈ మ్యాప్ అంటే కేవలం గీతలు, ఆకారాలు, రంగులు అని భావిస్తాం. కానీ వాస్తవానికి మ్యాప్ అనేది రాజకీయ, చట్టబద్ధ, అంతర్జాతీయ సంబంధాల ప్రతిబింబం. శ్రీలంకను భారతదేశ మ్యాప్లో చూపించడం వెనుక కారణం ఈ విషయం మనకు గుర్తుచేస్తుంది. భౌగోళికత ఒక సాధారణ పాఠం కాకుండా, దేశాల భవిష్యత్తు నిర్ణయించే శక్తిగా మారుతుంది.
భారత మ్యాప్లో కనిపించే చిన్న ద్వీప దేశం వెనుక అంత పెద్ద అంతర్జాతీయ చట్టం ఉందని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యం కలగకమానదు. ఒక మ్యాప్లోని గీతలు మనకు కేవలం దూరాలను కాకుండా, దేశాల హక్కులు, బాధ్యతలు, సంబంధాలను కూడా చెబుతాయి. శ్రీలంక స్థానం ఆ వాస్తవానికి ఒక సజీవ ఉదాహరణ.
