మీ ఇంట్లో మీరెంతమంది.. మీరే నమోదు చేసుకోండి!
మొత్తంగా జనాభా లెక్కల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
By: Garuda Media | 13 March 2026 10:00 PM ISTమీ ఇంట్లో మీరు ఎంత ఉన్నారు? ఏయేం చేస్తుంటారు? చదివేవారు ఎందరు? ఎక్కడ పనిచేస్తున్నారు? ఏయే వయసుల వారు ఉన్నారు? .. ఇలా జనగణనలో అనేక ప్రశ్నలు తెరమీదికి వస్తాయి. వీటి ఆధారంగా నే దేశంలో ఎంత మంది జనాభా ఉన్నారు? ఏయే వయసుల వారు ఉన్నారు? చదువుతున్న వారు ఎందరు? ఉద్యోగాలు చేస్తున్న వారు ఎందరు? అనే అనేక విషయాలు వెలుగు చూస్తాయి. మొత్తంగా జనాభా లెక్కల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
అయితే.. సదరు జనాభా లెక్కలు తీసుకునే అధికారులు వచ్చినప్పుడు ఇంట్లో వారు అందుబాటులో లేకపోతే ఎలా? వారి కోసం కాచుకుని కూర్చోవాలా? అంటే.. ఆ అవసరం లేదు. మీ ఇంట్లో మీరు ఎంత మంది ఉన్నారు? ఏమేం చేస్తున్నారన్న వివరాలను మీరే స్వయంగా నమోదు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. 'Self Enumaration' పేరుతో రూపొందిన ఆప్.. త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ యాప్ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని.. ఎవరి వివరాలను వారు నమోదు చేసుకోవచ్చు.
ఈ జనాభా గణనలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. కుటుంబ పెద్ద ఈ వివరాలను అందించాల్సి ఉం టుంది. ఆధార్ నెంబర్ల నుంచి ఇంటి నెంబరు వరకు అన్నీ చెప్పాలి. మొత్తం 33 ప్రశ్నల్లో చదువు, ఉద్యోగం, వర్ణం, సబ్ క్యాస్ట్, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు, ఆదాయం, సొంతిల్లా, అద్దెల్లా, రేకులిల్లా.. కొట్టమా? ఇలా.. అనేక ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. అయితే.. యాప్ను భారత దేశంలోని అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. నమోదు అనంతరం ప్రింటు తీసుకునే సౌకర్యం కూడా ఉంది.
తెలంగాణ, ఏపీల్లో ఫస్ట్!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీ, తెలంగాణల్లో జనగణన చేయడం ఇదే తొలిసారి. 2010లో ఒకసారి గణించారు. ఆ తర్వాత.. 2020లో చేయాల్సి ఉన్నా.. కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. ఇక, ఆ తర్వాత.. రాష్ట్రాల ఎన్నికల కారణంగా కూడా ఇది వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం తొలి దశలో ఇళ్లను, కులాలను లెక్కించి.. అనంతరం జనాభాను లెక్కించనున్నారు. ఆ తర్వాతే.. జమిలి ఎన్నికలపైనా నిర్ణయం తీసుకుంటారు.
