అక్కడి ఐటీ ఉద్యోగులకు వర్కు ఫ్రం హోం ఇచ్చేశారు
తాజాగా భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారిన వేళ సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని నగరాలకు చెందిన ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను పునరుద్ధరించారు.
By: Tupaki Desk | 10 May 2025 9:51 AM ISTకొవిడ్ తో పాపులర్ అయిన వర్క్ ఫ్రం హోం.. ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా తగ్గించటమే కాదు.. చాలా తక్కువ మందికి తప్పించి ఈ సౌకర్యాన్ని ఇవ్వని పరిస్థితి. ఒకప్పుడు ఐటీ ఉద్యోగులకు వరంగా ఉన్న వర్క్ ఫ్రం హోంను చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా కంపెనీలన్నీ ఈ సౌకర్యాన్ని తీసేయటం తెలిసిందే. అయితే.. తాజాగా భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారిన వేళ సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని నగరాలకు చెందిన ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను పునరుద్ధరించారు.
గడిచిన రెండు.. మూడు రోజులుగా మన దేశ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము కశ్మీర్.. పంజాబ్.. రాజస్థాన్.. గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకొని.. ఆత్మాహుతి డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడటం తెలిసిందే. అయితే.. వీటిని మన యాంటీ డ్రోన్ వ్యవస్థ సమర్థంగా నిలువరిస్తూ.. పాక్ ఎత్తులకు చెక్ పెడుతున్న పరిస్థితి. ఈ ఉద్రిక్త వాతావరణంలో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేలా ఐటీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
చండీగఢ్.. గురుగ్రామ్.. నోయిడా.. ఢిల్లీ.. జయపుర్.. అహ్మదాబాద్ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఐటీ సిబ్బందిని ఇంటి నుంచి పని చేయాలని ఐటీ కంపెనీలు కోరుతున్నాయి. దీనికి సంబంధించిన అనుమతులు ఇచ్చేశాయి. హెచ్ సీఎల్.. ఈవై.. కేపీఎంజీ.. డెలాయిట్ లాంటి కంపెనీలు ఈ అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీర్ఘకానికి కాకుండా ఈ వారాంతం వరకు మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా నెలకొన్న పరిణామాలను సమీక్షించిన అనంతరం సోమవారం నుంచి ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారనిచెబుతున్నారు.
అదే సమయంలో కొన్ని కీలక సూచనలు చేశాయి ఐటీ సంస్థలు. అత్యవసరం కాకుంటే విధేవీ ప్రయాణాలు పెట్టుకోవద్దని చెప్పిన సంసథలు.. ఇరు దేశాలకు సంబంధించిన ఉద్రిక్తతలపై సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేయొద్దని పలు కంపెనీలు తమ ఉద్యోగుల్ని కోరుతున్నాయి. అంతేకాదు.. తమ క్లయింట్లతో మాట్లాడే సమయంలో యుద్ధ అంశాల్ని ప్రస్తావించొద్దని పేర్కొంటున్నాయి. మొత్తంగా తాజా ఉద్రిక్తతల వేళ.. పరిస్థితులకు అనుగుణంగా ఐటీ కంపెనీల నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పొచ్చు.