Begin typing your search above and press return to search.

ఇండియా-అమెరికా విమాన ప్రయాణం ఇక మరింత భారం.. దూరం

పాకిస్తాన్ గగనతలం మూసివేతతో భారతీయ విమాన సంస్థలు సుదీర్ఘ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది.

By:  Tupaki Desk   |   25 April 2025 11:21 AM IST
India-Pakistan Tensions Could Disrupt Air Travel to the U.S.
X

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన హేయమైన ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సాధారణ ప్రజల విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలకు కౌంటర్‌గా, పాకిస్తాన్ ప్రభుత్వం భారతీయ విమానయాన సంస్థలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికా, కెనడా, యూరప్ , ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, టిక్కెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

పాకిస్తాన్ గగనతలం మూసివేతతో భారతీయ విమాన సంస్థలు సుదీర్ఘ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల విమానాల ప్రయాణ వ్యవధి పెరుగుతుంది, అధిక ఇంధనం అవసరమవుతుంది. నిర్వహణపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ చివరికి ప్రయాణీకులపై అధిక ఛార్జీల రూపంలో భారం మోపనున్నాయి. గతంలో 2019లో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ ఇదే విధంగా తన గగనతలాన్ని మూసివేసినప్పుడు, భారత విమానయాన సంస్థలు రూ. 700 కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి.

పాకిస్తాన్ తాజా నిర్ణయం ఉత్తర అమెరికా, యూకే, యూరప్, మధ్యప్రాచ్యం, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా , కాకసస్ ప్రాంతాలకు వెళ్లే భారతీయ విమానాలపై ప్రభావం చూపుతుంది. అయితే, ఇతర దేశాలకు చెందిన విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలం గుండా భారత్‌కు రాకపోకలు సాగించడానికి అనుమతి ఉన్నందున, వారికి ఇది ప్రయోజనకరంగా మారనుంది. ఢిల్లీ, లక్నో, అమృత్‌సర్ వంటి ఉత్తర భారత విమానాశ్రయాల నుండి బయలుదేరే విమానాలు గుజరాత్ లేదా మహారాష్ట్ర మీదుగా దారి మళ్లి, ఆ తర్వాత యూరప్, ఉత్తర అమెరికా లేదా పశ్చిమ ఆసియా వైపు వెళ్లాల్సి ఉంటుంది.

భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో ఈ పరిస్థితిపై తమ ప్రయాణీకులకు సమాచారం అందించాయి. పాకిస్తాన్ గగనతలం మూసివేత కారణంగా తమ విమాన సేవలకు అంతరాయం కలుగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇండిగో కూడా తమ ప్రయాణీకులకు ప్రత్యామ్నాయంగా రీబుకింగ్ లేదా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇండిగో ఇప్పటికే ఢిల్లీ నుండి బాకు , టిబిలిసి వెళ్లే తన సాయంత్రం విమానాల వ్యవధిని గంటన్నర వరకు పొడిగించింది, అలాగే ఢిల్లీ-అల్మాటీ విమానాన్ని రద్దు చేసింది.

2019లో పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేసినప్పుడు, చాలా విమానాల ప్రయాణ సమయం కనీసం 70-80 నిమిషాలు పెరిగింది. ఢిల్లీ నుండి చికాగో వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు ఇంధనం నింపుకోవడానికి యూరప్‌లో ఆగాల్సి వచ్చింది. మరోవైపు, ఢిల్లీ నుండి ఇస్తాంబుల్ వెళ్లే ఇండిగో విమానం ఇంధనం కోసం ఖతార్‌లోని దోహాలో ఆగింది. ప్రస్తుతం భారత్ , పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభన పరిస్థితి.. భారతీయ విమాన సేవ లపై దాని ప్రభావం రాబోయే కొద్ది రోజుల్లో మరింత స్పష్టంగా తెలియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణీకులు తమ విమాన సమాచారాన్ని ఎప్పటికప్పుడు విమానయాన సంస్థల నుండి తెలుసుకోవడం శ్రేయస్కరం.