సింధూ జలాలివ్వండి.. కాళ్లబేరానికొచ్చిన పాకిస్తాన్
అయితే, సింధూ జలాల విషయంలో భారత్ వైఖరి అత్యంత దృఢంగా ఉంది. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పై ఆగ్రహంతో ఉన్న భారత్, ఈ విషయంలో వెనక్కి 'తగ్గేదే లే' అని స్పష్టం చేస్తోంది.
By: Tupaki Desk | 14 May 2025 9:37 PM ISTసింధూ జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేయడంతో పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. మొన్నటి వరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయాది దేశం, సింధూ జలాల నిలిపివేత వల్ల కలిగే నష్టంపై ఆందోళన చెందుతూ ఆత్మరక్షణలో పడింది. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలంటూ భారత్ను అభ్యర్థిస్తూ కాళ్లబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది.
- పాకిస్తాన్ అభ్యర్థన - కరువు భయం
సింధూ జలాలు నిలిపివేస్తే తమ దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ జలవనరుల శాఖ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది.
- భారత్ వైఖరి దృఢం: రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు
అయితే, సింధూ జలాల విషయంలో భారత్ వైఖరి అత్యంత దృఢంగా ఉంది. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్తాన్పై ఆగ్రహంతో ఉన్న భారత్, ఈ విషయంలో వెనక్కి 'తగ్గేదే లే' అని స్పష్టం చేస్తోంది. "రక్తం, నీరు రెండూ కలిసి ప్రవహించలేవు" అని ప్రధాని మోదీ ఇప్పటికే తేల్చిచెప్పారు. పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అవి కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్పైనే అని భారత్ స్పష్టం చేసింది.
-ఏమిటీ సింధూ జలాల ఒప్పందం?
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ల మధ్య సింధూ నది, దాని ఉపనదుల జలాల పంపకంపై సింధూ జలాల ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం, సింధూ నది తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. సింధూ నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి.
-ఉగ్రవాదానికి ప్రతీకారంగా భారత్ చర్య?
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వంటి ఘటనల అనంతరం పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రకటించింది. ఈ కఠిన వైఖరి పాకిస్తాన్ను ఆందోళనకు గురిచేసింది, ఫలితంగా ఇప్పుడు చర్చలకు సిద్ధమని, నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని అభ్యర్థిస్తోంది.
కానీ ఉగ్రవాదాన్ని అరికట్టేవరకూ పాకిస్తాన్ కు సింధూ జలాలను పంపించేది లేదని మోడీ స్పష్టం చేశారు. పీఓకే, ఉగ్రవాదంపైనే చర్చలు జరగాలని స్పష్టం చేశారు. దీంతో పాకిస్తాన్ కు సింధూ జలాలు లేక కరువుతో అల్లాడడం ఖాయం.
