షాకింగ్ అప్ డెట్... 36 ప్రదేశాలు లక్ష్యంగా 400 పాకిస్థాన్ డ్రోన్లు!
ఈ సమయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి బ్రీఫింగ్ కు మరోసారి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు.
By: Tupaki Desk | 9 May 2025 8:50 PM ISTఉగ్రవాదులపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా భారత్ పై దాడి చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్.. సంచలన స్థాయిలో ఈ ప్రయత్నాలు చేసిందని భారత విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ ఉమ్మడి ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఈ సమయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి బ్రీఫింగ్ కు మరోసారి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నాయకత్వం వహించారు.
అవును... భారత్ లక్ష్యంగా పాకిస్థాన్ పెద్ద ఎత్తున డ్రోన్లు ప్రయోగించిందని కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా... భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నించిందని.. నియంత్రణ రేఖ వెంబడి చాలాసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని.. ఇదే సమయంలో ఉత్తరాన్న 36 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు.
ఇదే సమయంలో మే 8న భారత నగరాలపై జరిగిన దాడిలో పాకిస్థాన్ సైన్యం టర్కీష్ డ్రోన్ లను ఉపయోగించినట్లు ప్రభుత్వం తెలిపింది. కూలిన డ్రోన్ లనుంచి స్వాధీనం చేసుకున్న శిథిలాల ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణలో అవి టర్కీ తయారు చేసిన ఆసిస్ గార్డ్ సోంగర్ నమూనాలను సూచిస్తున్నాయని తెలిపింది.
ఈ విధంగా పాక్ సాయుధ దళాలు గురు - శుక్రవారాల్లోని మధ్య రాత్రి సమయంలో సరిహద్దుల్లో డ్రోన్లు, ఇతర మందుగుండి సామాగ్రిని ఉపయోగించి బహుళ దాడులు చేసిందని.. అయితే వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టామని వ్యోమికా సింగ్ తెలిపారు. వీటి సంఖ్య సుమారు 300 నుంచి 400 వరకూ ఉంటుందని ఆమె వెల్లడించారు.
ఇదే సమయంలో.. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులు మొదలుపెట్టినప్పటినుంచీ అక్కడి పౌర విమానాలకు గగనతలాన్ని మూసివేయలేదని.. కరాచీ, లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నాయని రక్షణశాఖ ప్రతినిధులు కర్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా వెల్లడించారు. దీని వెనుక పాక్ వక్ర బుద్ధి దాగుందని వెల్లడించారు.
ఇందులో భాగంగా.. తమ దాడులకు భారత్ నుంచి ఎలాగూ ప్రతిస్పందన ఉంటుందని తెలిసీ.. అందుకు పౌర విమానాలను పాకిస్థాన్ రక్షణ కవచంగా వాడుకుంటోందని వెళ్లడించారు. అయితే భారత్ – పాక్ సరిహద్దుల్లో వెళ్లే అంతర్జాతీయ పౌర విమానాలను దృష్టీలో ఉంచుకుని భారత వాయుసేన సంయమనంగా వ్యవహరించిందని తెలిపారు.
మరోవైపు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యున్నత సైనిక నాయకత్వతో జాతీయ భద్రతపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఇదే సమయంలో.. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించబడి, అన్ని నగర ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అదేవిధంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 27 ఎయిర్ పోర్టులు మూసివేయబడ్డాయి!