ట్రంప్ కు ఏమైంది.. భారత్ విషయంలో అబద్ధాలు చెబుతున్నారా?
ఈ క్రమంలో శనివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. దాని ఉద్దేశ్యం.. తక్షణమే శాస్వత కాల్పుల విరమణకు భారత్ – పాక్ అంగీకరించాయని.. అది అమెరికా మధ్యవర్తిత్వం వల్ల సాధ్యమైందని చెప్పారు.
By: Tupaki Desk | 13 May 2025 9:45 AM ISTఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. దాని ఉద్దేశ్యం.. తక్షణమే శాస్వత కాల్పుల విరమణకు భారత్ – పాక్ అంగీకరించాయని.. అది అమెరికా మధ్యవర్తిత్వం వల్ల సాధ్యమైందని చెప్పారు. అయితే... ఈ విషయంపై పాక్, భారత్ ల రియాక్షన్స్ లో తేడా స్పష్టంగా కనిపించింది.
అవును... "అమెరికా మధ్యవర్తిత్వలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.. తక్షణమే శాస్వత కాల్పుల విరమణ చేపట్టేందుకు భారతదేశం, పాకిస్థాన్ అంగీకరించాయి.. సరైన సమయంలో ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయి.. అందుకు ధన్యవాదాలు" అని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇదే విషయంలో తన పాత్రనూ కలిపి.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా చెప్పుకొచ్చారు!
అనంతరం స్పందించిన భారత్... పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు భారత్ డీజీఎంవో కు ఫోన్ చేశారని.. ఇరు పక్షాలు భూమిపైనా, గాలిలో, సముద్రంలో కాల్పులు, సైనిక చర్యలను సాయంత్రం 5 గంటల నుంచి నిలిపేయాలని అంగీకరించాయని తెలిపారు. మే 12న డీజీఎంవోలు ఇద్దరూ మళ్లీ మాట్లాడతారని విదేశాంగ కార్యదర్శి మిస్రి తెలిపారు.
అంతే తప్ప.. ఇదంతా అమెరికా వల్ల, డొనాల్డ్ ట్రంప్ వల్ల జరిగిందనే విషయాన్ని భారత్ ఎక్కడా చెప్పలేదు. అలా అని ట్రంప్ ప్రమేయం లేదని కాదు! అలా అయితే... అందరికంటే ముందే ట్రంప్ ప్రకటించి ఉండేవారు కాదు కదా!! కాకపోతే... ట్రంప్ ప్రస్థావన భారత్ తీసుకురాలేదు. అంటే... ఈ సీజ్ ఫైర్ విషయంలో పాక్ కంటే ఎక్కువగా అమెరికానే భారత్ ను బ్లాక్ మెయిల్ లేదా ఒత్తిడి చేసిందా అనేది తెలియాల్సి ఉంది!
దీనిపై స్పందించిన పాకిస్థాన్ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్... పాకిస్థాన్, భారత్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. పాకిస్థాన్ ఎల్లప్పుడూ శాంతిభద్రతల కోసమే పాటుపడుందని చెప్పుకున్నారు. అంతే తప్ప.. ఇదంతా ట్రంప్ వల్ల అని చెప్పలేదు కానీ... పాక్ ప్రధాని మాత్రం ఈ సీజ్ ఫైర్ అనంతరం ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు.
కట్ చేస్తే... భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి తమ మధ్యవర్తిత్వమే కారణం అన్ని చెప్పిన ట్రంప్.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న మరో వివాదంపై కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. వేల సంవత్సరాల నాటి కాశ్మీర్ సమస్యపైనా మద్యవర్తిత్వం వహిస్తానని.. ఇరు దేశాలతో కలిసి కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు. దీంతో... ఈ ప్రకటనను పాకిస్థాన్ ప్రధాని స్వాగతించారు!
అయితే... భారతదేశం అలాంటి మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. కాశ్మీర్ విషయంలో ఇంక మాట్లాడటానికి ఏమీ లేదని.. పీఓకే ను భారత్ కు అప్పగించడం మాత్రమే మిగిలి ఉందని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు... ఏదైనా చేయాలనుకుంటే మీకున్న సామర్థ్యంతో ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ కు సహకరించాలని.. అంతే తప్ప, భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని భారతీయులు ట్రంప్ కు సూచించారు.
ఇక తాజా విషయానికొస్తే... చాలా అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య ప్రమాదకరమైన సంఘర్షణను తన ప్రభుత్వ మధ్యవర్తిత్వం వల్ల ముగించడం జరిగిందని.. తాము ఒక అణు యుద్ధాన్ని ఆపామని.. ఆ అణుయుద్ధమే జరిగి ఉంటే లక్షలాది మంది చనిపోయి ఉండేవారని చెప్పిన ట్రంప్... వారితో చాలా వాణిజ్యం చేస్తామని చెప్పి ఒప్పించినట్లు తెలిపారు. తాను వాడినట్లుగా వాణిజ్యాన్ని ఇంకెవ్వరూ ఉపయోగించలేదని చెప్పారు.
దీంతో మరోసారి భారత్ స్పందించింది. మే 8న అమెరికా విదేశాంగ మంత్రి రూబియోతో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు.. 9న యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తో నరేంద్ర మోడీ మాట్లాడారు.. మే 10న మార్క్ రూబియోతో అజిత్ దోవల్ మాట్లాడారు. ఈ మొత్తం చర్చల్లో ఎక్కడా, ఎవరి మధ్యా “వాణిజ్యం” ప్రస్థావనే రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో... ట్రంప్ వైఖరిపై పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఇందులో భాగంగా... కాల్పుల విరమణ విషయంలో భారత్ ను ట్రంప్ తనకున్న అధికారాలతోనో, బలంతోనో బలవంతం పెట్టారా..? లేక, పాకిస్థాన్ గురించి చెప్పాల్సినవన్నీ.. ఇరు దేశాలకూ ఆపాదిస్తున్నారా..? ఆ స్థాయి వ్యక్తి ప్రపంచం ముందు ఇలా అసత్యాలు మాట్లాడుతూ.. అమెరికాతో వాణిజ్యం కోసం, భారత్ ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని తాకట్టు పెట్టుకుందని చెప్పాలనుకుంటున్నారా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా... ప్రధానంగా భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్లో.. అడగకుండా ఇస్తున్న ఆఫర్స్ తో.. భారత్ ప్రకారం అసత్యలు చెబుతున్న విషయంలో పాల్ 2.0 అవుతున్నారా అనే చర్చా తెరపైకి వచ్చిందని చెబుతున్నారు!
