బోర్డర్లో ఉద్రిక్తతలు.. సైబర్ నేరగాళ్ల నయా దందా స్టార్ట్ చేశారు!
మరోపక్క భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.. సుమారు 27 విమానాశ్రయాలను ప్రస్తుతానికి మూసేశారు!
By: Tupaki Desk | 10 May 2025 5:00 AM ISTభారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. అందుకు ప్రతీకారంగా భారత్ పై పాకిస్థాన్ క్షిపణి దాడులకు తెగబడుతుంది. భారత్ వాటిని తిప్పికొడుతుంది.
మరోపక్క నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ఈ సమయంలో భారత్ సైన్యం గట్టిగా బుద్ది చెబుతోంది. ఇదే సమయంలో... సాధారణ పౌరులే లక్ష్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో డ్రోన్ లను ప్రయోగిస్తూ రాక్షసానందం పొందుతుంది పాక్. ఇలా పాకిస్థాన్ చేస్తోన్న దుశ్చర్యలకు భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుంది!
మరోపక్క భారత్ లోని సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు.. సుమారు 27 విమానాశ్రయాలను ప్రస్తుతానికి మూసేశారు! ఇక సెలవుల్లో ఉన్న సైనిక, పోలీసు, రైల్వే ఉద్యోగులకు అవి రద్దు చేశారు. ఈ స్థాయిలో ప్రభుత్వ చర్యలు చేపడుతోంది.. మరోపక్క ఫేక్ న్యూస్ లపై ప్రజలను అప్రమత్తం చేస్తుంది! ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు ఎంటరయ్యారు.
అవును... ప్రపంచం ఏమైపోతున్నా, దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నా ప్రజలను మోసం చేసుకునే విషయంలో తమ పని తమదే అన్నట్లుగా.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకునేందుకు సిద్ధమయ్యారు. తాజా పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
అవును... తాజా పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఏస్ ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దీనిద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను వివరిస్తూ.. సైబర్ నేరగాళ్లు విరాళాలు అడుగుతున్నరని సజ్జనార్ తెలిపారు.
ఈ సందర్భంగా... "సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. ఆర్మీ అధికారులమంటూ సందేశాలు పంపుతూ.. అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలాంటి నకిలీ ఆర్మీ అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. డొనేషన్ సందేశాలను నమ్మి డబ్బు చెల్లిచకండి" అని సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.