ఇండియా ఔట్.. చైనా ఫస్ట్.. సరదా తీరిపోయిందిగా..?
అవును... మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మొదట్లో మహ్మద్ ముయిజ్జు.. చైనా అనుకూల విధానాలు అవలంబించడం మొదలుపెట్టారు.
By: Tupaki Desk | 25 July 2025 4:00 AM ISTగతేడాది జనవరిలో భారత్ పట్ల మాల్దీవ్స్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదనే సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనాతో అంటకాగడం మొదలుపెట్టింది! దీంతో.. పాలు ఇచ్చే ఆవుని వద్దనుకుని, దున్నపోతుతో సావాసం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపించాయి! ఇదే సమయంలో... "బాయ్ కాట్ మాల్దీవ్స్" పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. కాలం గడిచింది.. వారికి జ్ఞానం వచ్చినట్లుంది.
అవును... మాల్దీవులు అధ్యక్షుడిగా ఎన్నికైన మొదట్లో మహ్మద్ ముయిజ్జు.. చైనా అనుకూల విధానాలు అవలంబించడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... "చైనా ఫస్ట్" నినాదాన్ని ఎత్తుకుంది. ఇదే సమయంలో... భారత్ తో కలిసి నిర్వహిస్తున్న ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో... 'ఇండియా ఔట్' నినాదాన్ని తీసుకొచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయుజ్జు తన తొలి విదేశీ పర్యటనకు చైనాకే వెళ్లారు.
కట్ చేస్తే... చైనా ఫస్ట్ విధానాలను అనుసరించిన ముయిజ్జుకు త్వరగానే తత్వం బోధపడింది. అతడి వ్యవహారశైలితో మాల్దీవులను భారతీయులు బాయ్ కాట్ చేశారు. దీంతో... పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది. పర్యాటకమే ప్రధాన వనరుగా బ్రతుకుతున్న ఆ ద్వీప దేశానికి కష్టకాలం ఎదురొచ్చింది. ఈ సమయంలో... చైనాను సంప్రదించినా ఫలితం లేదు!
ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో, మరో గత్యంతరం లేకపోవడంతో ముయిజ్జు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపారు. ఈ సమయంలో భారత్ ఆదుకొంది. ఫలితంగా... సెప్టెంబర్ 2024లో 757 మిలియన్ అమెరికన్ డాలర్లకు సమానమైన సాయాన్ని భారత్, మాల్దీవులకు అందించింది. ఇదే సమయంలో... రాజధాని మాలెలో హౌసింగ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో... అదే ఏడాది అక్టోబర్ లో భారత్ పర్యటనకు వచ్చారు ముయిజ్జు. ఈ పర్యటనలోనే ప్రధాని మోడీని ముయిజ్జు మాల్దీవులకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి అబ్దుల్లా హలీల్ కూడా భారత్ ను సందర్శించి.. ప్రధానిని ఆహ్వానించారు. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ బలపడ్డాయి. ఈ నేపథ్యంలో మోడీ మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ ఈ విషయాలను వెల్లడించింది. ఇందులో భాగంగా.. మాల్దీవుల స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారని.. జులై 25, 26 తేదీల్లో అక్కడ నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలోనే... 'దటీజ్ భారత్'... 'మాల్దీవులకు ఇప్పటికైనా తత్వం బోదపడి ఉంటుంది' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
