Begin typing your search above and press return to search.

పాక్ పై ‘వాటర్ బాంబ్’... భారత్ కొట్టిన దెబ్బ ప్రభావం చెప్పిన సెనేటర్!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు పాక్ కు భారత్ కొన్ని దౌత్యపరమైన షాకులిచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 May 2025 12:39 AM IST
India Indus Waters Move Shocks Pakistan Senator
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంపై ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి ముందు పాక్ కు భారత్ కొన్ని దౌత్యపరమైన షాకులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. భారత్ తీసుకొన్న ఈ నిర్ణయం ప్రభావం పాక్ లో మొదలైపోయిందని అంటున్నారు. తాజాగా పాక్ సెనేటర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం పాక్ ను కలవరపెట్టడం మొదలుపెట్టిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్.. భారత్ తీసుకొన్న ఈ నిర్ణయాన్ని "వాటర్ బాంబ్" గా అభివర్ణించారు. దీంతో.. వారిలో ఈ టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది!

తాజాగా జరిగిన సెనేట్ సమావేశంలో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పార్టీ, ప్రతిపక్ష పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సీనియర్ నాయకుడు జాఫర్.. భారత్ తీసుకొన్న సింధూ జలాల నిర్ణయం పాకిస్థాన్ లోని ప్రతీ 10 మందిలో కనీసం ఒకరిని నేరుగా దెబ్బతీస్తుందని అన్నారు! ఇది విస్తృతమైన ఆకలికి, సామూహిక మరణాలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా స్పందించిన సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్... ఈ నీటి సంక్షోభాన్ని పాకిస్థాన్ ఇప్పుడు పరిష్కరించుకోకపోతే ఆకలితో చనిపోతామని అన్నారు. సింధూ నదీ పరివాహక ప్రాంతం పాక్ జీవనాడి అని.. పాక్ వాడే నీటిలో మూడువంతుల నీరు దేశం వెలుపల నుంచే వస్తాయని.. ఇక్కడ పంటలు 90% ఈ నీటిపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు!

ఇదే సమయంలో... పాకిస్థాన్ లోని 10 మందిలో తొమ్మిది మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం సింధూ నదీ పరివాహక ప్రాంతంపైనే ఆధారపడతారని.. అన్ని విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలు దానిపైనే నిర్మించబడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... భారత్ నిర్ణయం దేశంపై వేలాడుతున్న నీటి బాంబు అని.. దానిని వెంటనే నిర్వీర్యం చేయాలని పాక్ ప్రభుత్వానికి సూచించారు.

కాగా... పాక్ కు సింధూ నదీ వ్యవస్థ జీవనాడి లాంటిది! ఈ నదీ వ్యవస్థ నుంచి సుమారు 93% నీటిని పాకిస్థాన్ నీటిపారుదల, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తుంది. ఇదే సమయంలో.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే వ్యవసాయానికి సంబంధించిన సాగునీటిలో సుమారు 80% భూమి ఈ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే.. భారత్ నిర్ణయం పాక్ పై వేలాడుతోన్న నీటి బాంబు గా అభివర్ణించారు జాఫర్!