Begin typing your search above and press return to search.

గల్ఫ్ దేశాల్లో కేంద్ర మంత్రులు.. ఏం జరుగుతోంది..?

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భారత్‌కు ఒక పెద్ద సవాలుగా మారింది.

By:  A.N.Kumar   |   9 April 2026 7:22 PM IST
గల్ఫ్ దేశాల్లో కేంద్ర మంత్రులు.. ఏం జరుగుతోంది..?
X

అమెరికా–ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా భారత్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలతో ఇంధన సరఫరా భద్రతను పటిష్టం చేసేందుకు.. సమన్వయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రులు వరుస పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు దేశ ఇంధన అవసరాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఖతార్‌లో హర్దీప్ సింగ్ పూరీ పర్యటన

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నేటి నుండి రెండు రోజుల పాటు ఖతార్‌లో పర్యటించనున్నారు. అధికారికంగా ఈ పర్యటన వివరాలను పూర్తిగా వెల్లడించనప్పటికీ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా ఇది అత్యంత కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల ఖతార్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్.ఎన్.జీ) ఉత్పత్తి , ఎగుమతులు తాత్కాలికంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రతీకార దాడుల భయం భద్రతా కారణాల దృష్ట్యా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది.

ఇప్పుడు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఖతార్ తిరిగి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. అయితే ప్రస్తుతానికి పరిమిత స్థాయిలోనే కార్యకలాపాలను కొనసాగించాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అవసరమైన ఎల్‌ఎన్‌జీ నిరంతరాయంగా అందేలా చూడటం ఇప్పటికే ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాలపై స్పష్టత సాధించడం పురీ పర్యటన ప్రధాన ఉద్దేశం. భారత్ తన ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం ఖతార్‌పైనే ప్రధానంగా ఆధారపడటం గమనార్హం.

యూఏఈకి విదేశాంగ మంత్రి జైశంకర్

మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా దౌత్యపరమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటించనున్నారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న తాజా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య మార్గాల భద్రత , ప్రధానంగా ఇంధన సరఫరా గొలుసు లో ఆటంకాలు కలగకుండా చూడటంపై ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

హార్ముజ్ జలసంధి సవాలు.. ప్రభుత్వ ధీమా

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూసివేత భారత్‌కు ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ మార్గం గుండానే భారత్‌కు అవసరమైన అధిక శాతం క్రూడ్ ఆయిల్, ఎల్‌ఎన్‌జీ రవాణా అవుతుంది. ఇది తాత్కాలికంగా మూతబడటంతో దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ భయాలను తోసిపుచ్చింది. దేశంలో ప్రస్తుత అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సరఫరాలో అంతరాయం కలిగితే ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు భద్రపరిచిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను సిద్ధంగా ఉంచింది. "భారత్ ఇంధన భద్రత విషయంలో రాజీ పడదు. గల్ఫ్ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం" అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

మొత్తానికి కేంద్ర మంత్రుల ఈ గల్ఫ్ పర్యటనలు కేవలం మర్యాదపూర్వకమైనవి కావు. ఇవి భవిష్యత్తులో రాబోయే ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకుని, దేశ ఆర్థిక వ్యవస్థను ఇంధన కొరత బారిన పడకుండా కాపాడే ముందస్తు వ్యూహాత్మక చర్యలు. ఈ పర్యటనల ద్వారా భారత్ తన ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.