Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... ఆపరేషన్ సిందూర్ పై సంచలన అప్ డేట్!

ఆపరేషన్ సిందూర్ పై తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   8 May 2025 3:24 PM IST
బిగ్  బ్రేకింగ్... ఆపరేషన్  సిందూర్  పై సంచలన అప్  డేట్!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి సుమారు 80 మందిని హతమార్చింది! ఈ సమయంలో తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో రాజ్ నాథ్ సింగ్ ఈ ఆపరేషన్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ఈ ఆపరేషన్ లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అయితే... దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు వెల్లడించలేమని అన్నారు. అయితే.. ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం తమకు లేదు కానీ.. పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం తగ్గేదేలేదని వెల్లడించారు.

అయితే... పాకిస్థాన్ లోని లాహోర్ లో గురువారం వరుసగా పెద్ద పెద్ద పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని స్థానిక మీడియా నివేదించిన నేపథ్యంలో.. ఆ ఘటనపై మాత్రం రాజ్ నాథ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఏది ఏమైనా... ఆపరేషన్ సిందూర్ లో సంభవించిన ఉగ్రవాదుల మరణాలపై ప్రభుత్వం అధికారిక స్పందించడం మాత్రం ఇదే తొలిసారి!

ఇక అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని రక్షణమంత్రి నాయకులకు తెలియజేశారని.. అయితే టెక్నికల్ గా బ్రీఫింగ్ ఇవ్వలేనని అన్నారు. అయితే.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అవ్వడంపై పార్టీలకు అతీతంగా నాయకులంతా ఏకగ్రీవంగా సాయుధ దళాలను అభినందించారని రిజిజు తెలిపారు.

ఇదే సమయంలో... దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ ను గుర్తించి.. ప్రతీ నాయకుడు బాధ్యతాయుతంగా, పరిణితితో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారని రిజిజు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వానికి వారి పూర్తి మద్దతును ప్రకటించారని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో స్పందింంచిన కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున్ ఖర్గే... సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ప్రభుత్వానికి తెలియజేశామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ పై ప్రతిపక్షాలు ఐక్యంగా నిలిచి ప్రభుత్వానికి అండగా ఉంటున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు!