కేంద్రంలో 30 మంది మంత్రులకు ఉద్వాసన? ప్రధాని మోదీ సంచలన నిర్ణయం!
కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరణపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
By: Tupaki Political Desk | 19 May 2026 3:35 PM ISTకేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరణపై ప్రధాని మోదీ ఫోకస్ చేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చేనెల 9వ తేదీతో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని ప్రధాని భావిస్తున్నారని బీజేపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నవారికి పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చని, వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారిలో సుమారు 30 మందిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. భారీ స్థాయిలో మంత్రులకు ఉద్వాసన పలికనున్నారనే చర్చ ఢిల్లీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది.
మూడో దఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయాలనే అంశంపై ఎక్కువగా దృష్టిపెట్టారని అంటున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో విపక్షాలు బలోపేతం అవుతున్న సంకేతాలతో బీజేపీ పెద్దలు అలర్ట్ అయ్యారని అంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోని అనుభవజ్ఞులకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్తు, వచ్చే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో యువకులకు ఎక్కువగా చోటివ్వాలని భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో 2014 నుంచి మంత్రివర్గంలో కొనసాగుతున్నవారిని పక్కన పెట్టొచ్చని అనుమానిస్తున్నారు.
అదేసమయంలో రాజ్యసభ పదవీకాలం పూర్తయిన మంత్రులు, పనితీరులో వెనకబడిన వారిని తప్పించే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. నీట్ ప్రశ్నపత్రాల లీకులతో అప్రతిష్ట మూటగట్టుకున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కుమారుడి కేసుతో రాజకీయంగా చిక్కుల్లో పడిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మంత్రి పేరు వినిపిస్తోందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిస్థానంలో కొత్తగా ఎవరిని తీసుకోవాలనే అంశంపై ప్రధాని సమాలోచనలు చేస్తున్నారని, ఇప్పటికే కొందరిపై సమాచారం తెప్పించుకున్నారని అంటున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లివచ్చిన వెంటనే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
నితీశ్ కి రైల్వే?
ఇక మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ప్రధాన కారణం బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న నితీశ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటామని బీజేపీ అగ్ర నాయకులు హామీ ఇచ్చారని చెబుతున్నారు. గత నెలలో పదవిని త్యాగం చేసిన నితీశ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆయనను మంత్రివర్గంలో చేర్చుకోవడం ఆలస్యమైందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి అవాంతరం లేనందున నితీశ్ కుమార్ కోసం ఏ క్షణమైనా మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే భారీ మార్పులు చేయొచ్చని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక కేంద్ర మంత్రివర్గంలో చేరనున్న నితీశ్ కుమార్ కు కీలకమైన రైల్వేలు అప్పగించే పరిస్థితి ఉందని అంటున్నారు. లేని పక్షంలో వ్యవసాయ శాఖను అయినా నితీశ్ కి అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు.
