Begin typing your search above and press return to search.

కాక్రోచ్‌-జ‌న‌సేన ఎఫెక్ట్‌: రాహుల్‌కు అంత ఈజీకాదు..!

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీ.. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.

By:  Garuda Media   |   16 Jun 2026 5:00 PM IST
కాక్రోచ్‌-జ‌న‌సేన ఎఫెక్ట్‌: రాహుల్‌కు అంత ఈజీకాదు..!
X

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు రాహుల్‌గాంధీ.. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. క‌నీసం అప్ప‌టికైనా ప్ర‌ధాని కావాల‌న్న‌ది ఆయ‌న ఆశ‌గా ఉంది. అందుకే.. ఇండి యా కూట‌మిని బ‌లోపేతం చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త 12 సంవ‌త్స‌రాలుగా రాహుల్ సొంత పార్టీలోనే ఎదురీదుతున్నారు. ఇండియా కూట‌మిలోని పార్టీలు.. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకించాయి. దీంతో వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేదు. కానీ.. ఇప్పుడు ప‌రిస్థితి మారిందిలే అనుకున్నారు.

కూట‌మిలోని కొన్ని పార్టీల‌కు తమ త‌మ రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. దీంతో ఇప్పుడు కూట‌మితో చేతులు క‌లిపేందుకు ముందుకు వ‌చ్చారు. ఇది రాహుల్‌కు క‌ల‌సి వ‌చ్చింద‌ని అంచ‌నా వేసుకున్నారు. ఇక‌, త‌మ నాయ‌కుడే ప్ర‌ధాని అనే భావ‌న‌లో సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు. కానీ, ప్ర‌స్తుతం దేశ ముఖ చిత్రాన్ని గ‌మ‌నిస్తే.. ఇది అంత ఈజీకాద‌న్న సంకేతాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా 2029 నాటికి అత్యంత బ‌ల‌మైన శ‌క్తిగా మారే యువ‌త తీరు మారిపోతోంది.

గ‌తంలో రాహుల్ యువ‌త‌ను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేశారు. నాడు రాజ‌కీయంగా ఆయ‌న‌కు క‌లిసి రాలేదు. కానీ.. నేడు కూట‌మి ప‌క్షాలు స‌హ‌క‌రించేందుకు ముందుకు వ‌చ్చాయి. కానీ, యువ‌త తీరు మారింది. ప్ర‌స్తుతం రెండు ప్ర‌ధాన శ‌క్తులు.. రాహుల్‌కు స‌వాల్‌గా మారుతున్నాయి. వీటిలో

1) కాక్రోచ్ జ‌న‌తా పార్టీ.

2) జాతీయ స్థాయిలో విస్త‌రించాల‌ని భావిస్తున్న జ‌న‌సేన‌.

ఈ రెండు కూడా.. రాహుల్‌గా ప్ర‌ధాన అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంద‌ని జాతీయ మీడియా నిపుణులు పేర్కొంటున్నారు.

యువ‌త‌ను ఆక‌ర్షించ‌డంలోను.. వారి ఆవేశాన్ని.. త‌మ‌దైన శైలిలో తెర‌మీద‌కు తీసుకురావ‌డంలోను.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసింది. దీంతో నేడు యువ‌త మెజారీటీ ప‌క్షంగా.. కాక్రోచ్‌కు అనుకూలంగా మారింది. ఇక‌, తాజాగా ద‌క్షిణాదిలోనే కాకుండా.. ఉత్త‌రాదిలోనూ విస్త‌రిస్తామ‌ని చెబుతున్న జ‌న‌సేన కూడా యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించింది.

ఈ ప‌రిణామం కూడా.. రాహుల్ యువ రాజ‌కీయాల‌కు బ్రేకులు వేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 2029కి ఇంకా మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు శ‌క్తులు మ‌రింత పుంజుకుంటే.. రాహుల్ దీనిని ఎదుర్కొనేందుకు మ‌రింత శ్ర‌మించాలో.. లేక‌.. మ‌రేం చేయాల‌న్న దాని పై ఇప్ప‌టి నుంచే దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌నిసూచిస్తున్నారు. ఏదేమైనా.. రాహుల్‌కు వ‌చ్చే మూడు సంవ‌త్స‌రాలు.. చేసే రాజ‌కీయం అత్యంత కీల‌కంగా మారుతుంద‌ని అంటున్నారు.