ఐటీ రిటర్న్స్: 'మెయిల్'తో.. కొట్టేస్తున్నారు!
అంతే!. ఇంకేముంది.. ఈ-మెయిల్లో నమోదు చేసే వివరాల ఆధారంగా.. కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
By: Garuda Media | 25 March 2026 10:25 PM ISTసైబర్ మోసాలకు అంతుపొంతు లేకుండా పోయింది. అవకాశం.. ఉన్న ప్రతి అంశాన్నీ సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ సమయం వచ్చింది. దీంతో ఉద్యోగుల నుంచి వ్యాపారుల వరకు ఐటీ ఫైలింగ్లో మునిగిపోయారు. ఇక, చార్టెడ్ అకౌంటెంట్లకు క్షణం తీరిక లేకుండా పోయింది. కంపెనీల నుంచి వస్తున్న ఆఫర్లతో వారంతా బిజీబిజీగా గడిపేస్తున్నారు.
ఇలాంటి కీలక సమయంలో.. సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఇదే అదునుగా సొమ్ము కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్లలో నిబంధనలు పాటించే విషయంలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఆన్ లైన్ లో మెయిల్ పంపిస్తారు. అంతేకాదు.. ``ఇప్పుడు పంపించిన మెయిల్ ఓపెన్ చేసి మళ్లీ దరఖాస్తు చేయండి`` అని మెసేజ్ పంపిస్తారు. దీంతో నిజమేనని భావించే సగటు ఉద్యోగే కాదు.. చార్టర్డ్ అకౌంట్లు కూడా వీటిని ఓపెన్ చేస్తున్నారు.
అంతే!. ఇంకేముంది.. ఈ-మెయిల్లో నమోదు చేసే వివరాల ఆధారంగా.. కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. దీనిపై కేంద్ర పత్రికా సమాచార కార్యాలయం -పిఐబి స్పందించింది. ఈ ఇమెయిల్ నకిలీదని, పౌరులను మోసగించి వారి నుంచి నగదును దోచుకునే ప్రయత్నమని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖకు ఈ అంశంలో ఎలాంటి సంబంధం లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.
అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం, ఆన్లైన్లో వ్యక్తిగత ,ఆర్థిక సమాచారాన్ని పంచుకోవడం మానుకోవాలని పేర్కొంది.ఈ మోసపూరిత వెబ్ సైట్ ల పట్ల..అప్రమత్తంగా ఉండాలని...ప్రజలను తప్పుదారి పట్టించే ఈ నకిలీ మెయిల్, కంటెంట్ సమాచారాన్ని వెంటనే. వాట్సప్ నెంబర్.. .8799711259కానీ.. factcheck@pib.gov.in కు కానీ తెలియ చేయాలని స్పష్టం చేసింది. మొత్తంగా.. ఇప్పుడు ఆన్లైన్ లో ఏది `టచ్` చేయాలన్నా.. ఖాతా ఎక్కడ ఖాళీ అవుతుందోనన్న భయం వెంటాడుతోంది.
