Begin typing your search above and press return to search.

మనసును మెలితిప్పేలా.. ఒకే రోజు హైదరాబాద్లో 2 విషాదాలు

ఈ రెండు విషాదాల్లో ఒకటి ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు విడిచిన క్యాబ్ డ్రైవర్ ఉదంతం ఒకటైతే.. రెండోది మాత్రం చాలా చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకున్న వైనం బాధకు గురి చేస్తుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:45 AM GMT
మనసును మెలితిప్పేలా.. ఒకే రోజు హైదరాబాద్లో 2 విషాదాలు
X

విన్నంతనే అయ్యో అనిపించే రెండు విషాదాలు హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజులో చోటు చేసుకున్నాయి. ఈ రెండు విషాదాల్లో ఒకటి ఆకస్మిక గుండెపోటుతో ప్రాణాలు విడిచిన క్యాబ్ డ్రైవర్ ఉదంతం ఒకటైతే.. రెండోది మాత్రం చాలా చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకున్న వైనం బాధకు గురి చేస్తుంది. ఈ రెండు విషాదాలు అరుదైనవిగా చెప్పాలి. మెలి తిప్పే ఈ రెండు విషాదాల్లోకి వెళితే..

బడంగ్ పేటకు చెందిన 41 ఏళ్ల ధనుంజయ్ ఒక ప్రైవేటు ట్రావెల్స్ లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య.. కుమార్తె.. కొడుకు ఉన్నారు. శుక్రవారం ఉదయం ట్రావెల్స్ కు వచ్చిన ధనుంజయ్ యజమాని కారు తీసుకొని పాతబస్తీ లాల్ దర్వాజా ప్రాంతంలో ఒక ప్రయాణికుడ్ని పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. నల్లవాగు సమీపానికి అతడి కారు చేసుకున్న వేళ.. ధనుంజయ్ కు గుండెపోటు వచ్చింది. అప్పటికే తక్కువ వేగంతో ఉన్న కారును అదుపు చేసినప్పటికీ పక్కనే ఉన్న డివైడర్ పైకి ఎక్కింది.

దీంతో అక్కడి వారు వెళ్లేసరికి కారు డ్రైవ్ చేస్తున్న ధనుంజయ్ ప్రాణాలు విడిచాడు. దీన్ని గుర్తించినస్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. చాంద్రాయణగుట్ట ఇన్ స్పెక్టర్ గురునాథ్ ఘటనాస్థలానికి చేరుకున్నాడు. ఇంటి నుంచి ఉదయమే చలాకీగా డ్యూటీకి వెళ్లిన ధనుంజయ్ మరణ వార్త ఆ కుటుంబానికి కోలుకోలేని పెద్ద దెబ్బగా మారితే.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా అయ్యో అనుకునే పరిస్థితి.

మరో విషాద ఉదంతంలోకి వెళితే.. సీమంతానికి పిలిచే అతిధుల విషయంలో వచ్చిన మాట పట్టింపును సీరియస్ గా తీసుకున్న భర్త.. భార్యకు వీడియోకాల్ చేసి మరీ ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన 28 ఏళ్ల నరేష్ ఉప్పల్ లోని నిత్యశ్రీతో ఏడాది క్రితం పెళ్లై.. కలిసి ఉంటున్నారు. మెట్రో రైలులో సిగ్నలింగ్ విభాగంలో జాబ్ చేస్తున్నాడు. నిత్యశ్రీది కూడా యాదాద్రి జిల్లానే.

ఆమె గర్భిణి కావటంతో వారం క్రితం సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి సీమంతానికి బంధువులను పిలిచే విషయంలో భార్యభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి. ఇదే సమయంలో ఆస్తి తగాదాలు తోడయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేశ్.. శుక్రవారం భార్యకు కాల్ చేసి.. అప్పటికే ఫ్యాన్ కు చీరను కట్టి ఉంచిన దానిలో.. భార్య చూస్తుండగానే ఊరేసుకొని చనిపోయాడు. దీంతో.. భార్య నిత్యశ్రీ తీవ్రమైన షాక్ కు గురైన పరిస్థితి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.