గుంటూరు మేయర్ పీఠానికి ఎన్నిక.. వేడెక్కిన పాలిటిక్స్ ..!
ఈ నెల 28న మేయర్ ఎన్నిక ఉంటుందని ఇప్పటికే కార్పొరేటర్లు, ఎక్ అఫీషియో సభ్యులకు సమాచారం అందించారు.
By: Tupaki Desk | 27 April 2025 7:09 AMగుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠానికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు హీటెక్కాయి. కాగా.. ఈ పదవికి కూటమి తరఫున టీడీపీ నాయకుడు కోవెలమూడి రవీంద్ర.. ఉరఫ్ నానీ పేరు ఖరారైంది. ఈ క్రమంలో ఈ నెల 28 వ తేదీన మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు నగరపాలక సంస్థ ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. మేయర్ ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారి, సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ ను ఎన్నికల కమిషన్. నియమించింది. తేజ ఆదేశాలతో నగరపాలక అధికారులు మేయర్ ఎన్నిక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 28న మేయర్ ఎన్నిక ఉంటుందని ఇప్పటికే కార్పొరేటర్లు, ఎక్ అఫీషియో సభ్యులకు సమాచారం అందించారు. మేయర్ అభ్యర్థిగా రవీంద్ర పేరును ఎంపిక చేశారు. టిడిపికి చెందిన నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి నానీ పేరును పార్టీ నేతలు ఖరారు చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు శాసనసభ్యులు నసీర్, గల్లా మాధవి, రామాంజనేయులుతోపాటు ఒక మంత్రి సోదరుడుతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే నాని పేరును ఖరారు చేశారు.
చిత్రం ఏంటంటే.. ఈ పదవికి రెండో పేరు ప్రతిపాదనలు కూడా రాలేదని తెలిసింది. దీంతో కూటమి నేతలు బీఫారం నానికే ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆరు స్థాయీ సంఘం పదవులను కైవసం చేసుకున్న ఊపుతో ఉన్న టిడిపి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి పక్షాలు పట్టుదలతో ఉన్నాయి. మేయర్ అభ్యర్థిగా ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర పేరును ఖరారు చేశారు.
ఒక సమయంలో మార్కెట్ యార్డు చైర్మన్ గా పేరు పరిశీలనలో ఉన్నా చివరకు మేయర్ గా నానీ నే ప్రజాప్రతినిధులు ఖరారు చేశారు. ఇదిలావుంటే.. మరోవైపు వైసీపీ నుంచి అభ్యర్థిని ఒకరిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆపార్టీ నాయకుడు వెంకట రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ తమ పార్టీ కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. టీడీపీ, జననేనలో చేరిన సభ్యులను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గుంటూరు మేయర్ ఎన్నికల ఆసక్తిగా మారడం గమనార్హం.