అమెరికా తర్వాత విశాఖనే.. గూగుల్ రాకతో ఏపీ రాత మారనుందా?
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక ఘట్టం నమోదైంది.
By: A.N.Kumar | 14 Oct 2025 1:57 PM ISTఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక ఘట్టం నమోదైంది. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ , భారతదేశంలోనే అత్యంత భారీ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పెట్టనుంది. విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, వైజాగ్ 'ఏఐ సిటీ' గా రూపుదిద్దుకునే దిశగా ఇది కీలక అడుగుగా నిలవనుంది.
* గూగుల్ అతిపెద్ద పెట్టుబడి: ఏపీకి చారిత్రక రోజు
న్యూ ఢిల్లీలోని తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ సహా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ "అమెరికా వెలుపల గూగుల్ చేస్తున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా భారత్లో టెక్నాలజీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నాం. జెమినీ-ఏఐతోపాటు గూగుల్ క్లౌడ్ అందించే ప్రపంచ స్థాయి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులోకి వస్తాయి. దీని ద్వారా భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు వెలువడే అవకాశం ఉంది," అని పేర్కొన్నారు. ఇది విశాఖ నుంచి గ్లోబల్ కనెక్టివిటీని మరింత పెంచుతుందని తెలిపారు.
* రూ. 1.25 లక్షల కోట్ల పెట్టుబడి, భారీ ఉద్యోగాలు
గూగుల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఏకంగా 15 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియా ఖండంలో ఆ సంస్థ ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది. ఈ డేటా సెంటర్ 2028-32 మధ్య పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఏటా రూ.10,518 కోట్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP)కి తోడ్పాటు లభిస్తుంది. సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు (నేరుగా, పరోక్షంగా) సృష్టికావచ్చని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవల ద్వారా ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నారు.
* విశాఖ: గ్లోబల్ టెక్ మ్యాప్లో బలమైన స్థానం
రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ "టెక్నాలజీ ప్రపంచంలో ఇది ఏపీకి చరిత్రాత్మక రోజు. విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం, డిజిటల్ ఇన్నోవేషన్ రంగానికి కొత్త శకం. ఏపీని గ్లోబల్ టెక్ మ్యాప్లో బలంగా నిలబెట్టే మైలురాయి ఇది" అన్నారు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరిన్ని ప్రాజెక్టులు ఆకర్షిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని టెక్, డిజిటల్ ప్రాజెక్టులు త్వరలో రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం, భారతదేశ టెక్నాలజీ కేంద్రంగా మారేందుకు బలమైన పునాది పడింది. అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడిని ఆకర్షించడంతో, ఏపీ ఇకపై ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాల దృష్టిని మరింతగా ఆకర్షించనుంది.
గూగుల్ విశాఖ డేటా సెంటర్ ముఖ్య సాంకేతిక, ఆర్థిక వివరాలు
విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్ద హైపర్స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్గా రూపొందనుంది. పెట్టుబడి అంచనాలలో US$6 బిలియన్లు నుండి US$15 బిలియన్లు వరకు వివిధ నివేదికలు ఉన్నాయి. US$15 బిలియన్లు అనేది ఎయిర్టెల్తో భాగస్వామ్యం సహా 5 సంవత్సరాల మల్టీ-ఫేజ్ ఇన్వెస్ట్మెంట్గా తెలుస్తోంది.
* సాంకేతిక - మౌలిక సదుపాయాలు
ఈ క్లస్టర్కు ఉమ్మడిగా సుమారు 2100 మెగావాట్ల (MW) విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా. గూగుల్ ఈ డేటా సెంటర్ కోసం పునరుత్పాదక విద్యుత్ను వినియోగించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు ₹20,000 కోట్లు ఖర్చు చేయనుంది. సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే చిన్న హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా అవకాశం ఉంది.
డేటా సెంటర్ కూలింగ్ కోసం భారీగా నీరు అవసరం. సాగరతీరం కావడం వలన, కూలింగ్కు విశాఖ అనుకూలమైన ప్రదేశంగా గూగుల్ ఎంపిక చేసుకుంది.
అంతర్జాతీయ బ్యాండ్విడ్త్ను పెంచేందుకు 3 సబ్మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి డేటా సెంటర్ను అనుసంధానించనుంది. ముంబైలోని పియరింగ్, క్యాచీ సర్వర్ల నుంచి డార్క్ ఫైబర్ ద్వారా కేబుల్ తీసుకోవడం సులువు అవుతుంది.
గూగుల్ క్లౌడ్, సెర్చ్, యూట్యూబ్, జెమినీ-ఏఐ వంటి అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వర్క్లోడ్లను నిర్వహించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది.
* ప్రాజెక్ట్ కాలక్రమం (అంచనా)
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ సమర్పించిన ప్రతిపాదన ప్రకారం అంచనా వేసిన పనుల కాలక్రమం మార్చి 2026 నాటికి అనుమతులు లభిస్తే మొదటి దశ పూర్తి చేయడానికి నిర్మాణ ప్రారంభం అయిన 2.5 సంవత్సరాలలో చేస్తారు.. జూలై 2028 నాటికి లేదా 2028-2032 మధ్య పూర్తిస్థాయిలో కార్యకలాపాల ప్రారంభిస్తారు.
ఈ ప్రాజెక్టు పురోగతిని, ముఖ్యంగా భూసేకరణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
