జగన్ గోదావరి చూపు !
గోదావరి జిల్లాలు అన్నవి ఏపీలో రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనవి అన్నది తెలిసిందే. ఇక్కడ మొదలైన మార్పు ఏపీ మొత్తాన్ని చుట్టేస్తుంది
By: Tupaki Desk | 11 May 2025 1:00 AM ISTగోదావరి జిల్లాలు అన్నవి ఏపీలో రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైనవి అన్నది తెలిసిందే. ఇక్కడ మొదలైన మార్పు ఏపీ మొత్తాన్ని చుట్టేస్తుంది. ఇక్కడ అవును అంటే ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. కాదు అనుకుంటే మాత్రం ఇక గద్దె దిగాల్సిందే. రెండవ మాట లేనే లేదు.
అది ఈ రోజున కాదు ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి గోదావరి జిల్లాలకు ఆ సెంటిమెంట్ ఉంది. 1983, 1985లలో తెలుగుదేశం సైడ్ తీసుకున్న గోదావరి జిల్లాలు 1989లో కాంగ్రెస్ కి జై కొట్టాయి. మళ్ళీ 1994, 1999లలో టీడీపీని గెలిపించాయి. 2004లో కాంగ్రెస్ ని 2009లో ప్రజారాజ్యానికి గోదావరి జిల్లాలు షిఫ్ట్ అయ్యాయి. ఇక 2014లో విభజన ఏపీలో టీడీపీకి జై కొట్టాయి. 2019లో వైసీపీకి గట్టి మద్దతుగా నిలిచి జగన్ ని సీఎం గా చేశాయి. ఇక 2024లో చూస్తే మాకొద్దీ వైసీపీ అంటూ ఒక్క సీటు కూడా ఫ్యాన్ పార్టీకి ఇవ్వకుండా దారుణంగా ఓడిచేశాయి.
ఇపుడు చూస్తే వైసీపీ ఓడి ఏడాది కావస్తోంది కానీ గోదావరి జిల్లాలో ఆ పార్టీ గట్టిగా నిలబడటం లేదు. ఎక్కడ చూసినా కూటమి హడావుడే కనిపిస్తోంది. గోదావరి జిల్లాలలో సహజంగానే టీడీపీకి బలం ఉంది. జనసేన వైపు ఒక బలమైన సామాజిక వర్గం మొగ్గు చూపడంతో ఆ పార్టీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. ఇక బీజేపీ కూడా తన బలాన్ని ఇక్కడే పెంచుకుంటోంది.
దాంతో ఈ మూడు పార్టీల బలం ముందు ఎత్తుగడల ముందు వైసీపీ నిలిచి గెలవలేకపోతోంది. వైసీపీకి ఉమ్మడి పదమూడు జిల్లాలలో అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతాలు అంటే ముందుగా చెప్పుకోవాల్సింది గోదావరి జిల్లాల గురించే అని అంటున్నారు.
మరో వైపు చూస్తే గోదావరి జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు వరసబెట్టి వైసీపీకి గుడ్ బై కొట్టి వెళ్ళిపోయారు. ఇక వైసీపీకి చాలా చోట్ల నాయకత్వం బలహీనంగా ఉంది. పార్టీలో ఉన్న వారు కూడా సైలెంట్ అయిపోయారు. దాంతో పార్టీ దశ దిశ అన్నది ఎవరికీ అంతుపట్టకుండా ఉంది అని అంటున్నారు.
గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గం రాజకీయంగా శాసిస్తూ వస్తోంది. ఇది జనసేన టీడీపీ వైపు అధికంగా ఉంది. ఇక బీసీలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారంతా మొదటి నుంచి టీడీపీని వెన్నుదన్నుగా ఉన్నారు. అగ్రవర్ణాలు క్షత్రియులు బీజేపీకి సపోర్ట్ గా ఉన్నారు.
అదే సమయంలో ఎస్సీలు కూడా గణనీయంగా ఉన్నారు. వారు వైసీపీ వైపు ఉన్నారు. వైసీపీ తన బలాన్ని సామాజిక వర్గాల పరంగా పెంచుకోవాలంటే ముందు వ్యూహాలను మార్చుకోవాలని అంటున్నారు. 2019లో మాదిరిగా బీసీలు కాపులను తిరిగి ఆకట్టుకోవాలంటే కొత్త రకం పాలిటిక్స్ ని స్టార్ట్ చేయాలని గతంలో చేసిన పొరపాట్లను రిపీట్ చేయకుండా ఉండాలని అంటున్నారు.
ఇక వైసీపీ అధినేత జగన్ చూపు కూడా గోదావరి ఝిల్లాల వైపు ఉందని అంటున్నారు. పొలిటికల్ సెంటిమెంట్ గా ఉన్న గోదావరి జిల్లాలలో కనుక పార్టీ యాక్టివ్ అయితే ఏపీలో మళ్ళీ అధికారానికి ఆస్కారం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. దాంతో గోదావరి జిల్లాల నుంచే పార్టీలో కీలక స్థానాలలో అవకాశాలు ఇస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పీఏసీ మెంబర్ గా తీసుకోవడం అందులో భాగమే అని అంటున్నారు.
అలాగే బీసీలను కూడా దగ్గరకు చేర్చుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. వైసీపీ ఓటు బ్యాంక్ గా ఉన్న ఎస్సీలని గౌరవించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వచ్చే ఏడాది జూలై 7, 8 తేదీలలో రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీని ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీలో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఈ ప్లీనరీ ఎక్కడ అన్న చర్చ కూడా మొదలైంది.
అయితే వైసీపీ ప్లీనరీకి సరైన వేదిక గోదావరి జిల్లాలు అని అంటున్నారు. గోదావరి వాకిట నిలిచి వైసీపీ రాజకీయ బలాన్ని అటు ప్రత్యర్ధులకు ఇటు రాష్ట్రం మొత్తానికి చూపించడం ద్వరా తన స్టామినాను పెంచుకుని 2029లో అధికారంలోకి రావాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక జగన్ తొందరలో ప్రారంభించే జిల్లాల టూర్లను కూడా గోదావరి జిల్లాల నుంచే మొదలెడతారు అని అంటున్నారు. చూడాలి మరి గోదావరి జిల్లాలు ఈసారి ఏ ఫేస్ ఏ టర్నింగ్ ఇచ్చుకుంటాయో.