గంటా కోరి చేసుకుంటున్నారా ?
మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ కి మధ్య ఏమి జరుగుతోంది అన్నది చర్చగా ఉంది.
By: Tupaki Desk | 16 April 2025 2:30 PMమాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు టీడీపీ హైకమాండ్ కి మధ్య ఏమి జరుగుతోంది అన్నది చర్చగా ఉంది. గంటా తాజాగా ఏపీ టూ ఏపీకి రావడానికి మధ్యలో తెలంగాణాకు వెళ్ళాల్సి వచ్చింది అంటూ తన విమాన టికెట్లు కూడా సోషల్ మీడియాలో పెట్టి మరీ తన బాధను వ్యక్తం చేశారు.
నిజానికి ఇది విశాఖ విమాన ప్రయాణీకులు పడుతున్నదే. దానినే గంటా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకుని ఆయన అంతా బాహాటం చేశారు. దాంతో అది కాస్తా ఏపీలో టీడీపీ కూటమి కి ఒక విమర్శగా మారింది. పైగా విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లు అయింది.
కూటమి వచ్చాక విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే విమాన సేవలు రద్దు అయ్యాయి. దాంతో విమాన ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే విషయం గంటా చెప్పారు. అయితే అది నేరుగా ప్రభుత్వానికే తగిలేలా ఉందని భావించిన హైకమాండ్ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇది ప్రభుత్వ పార్టీ అంతర్గత వ్యవహారం అని సమస్య ఉంటే నేరుగా మాట్లాడే స్వేచ్చ హక్కు ఉన్న మాజీ మంత్రి సోషల్ మీడియాలో పోస్టులు చేయడమేంటని హైకమాండ్ కోపం ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పార్టీ పరువు తీయడమేనని కూడా పార్టీ పెద్దలు భావించి గంటాకు గట్టిగానే చెప్పాల్సింది చెప్పారని ప్రచారం సాగుతోంది.
ఇక గంటా చేసిన ట్వీట్ కి వివరణ ఇవ్వాలని హైకమాండ్ కోరినట్లుగా కూడా చెబుతున్నారు. కావాలనే గంటా ఈ ట్వీట్ చేసినట్లుగా హైకమాండ్ అభిప్రాయపడుతోంది అని అంటున్నారు. మరోసారి ఈ తరహా చర్యలు ట్వీట్లూ పునరావృత్తం కాకుండా చూసుకోవాలని కూడా హెచ్చరించింది అని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇంతటి సీనియర్ నేత ఎందుకు ఇలా ట్వీట్ బాహాటంగా చేశారు అన్న చర్చ సాగుతోంది. గంటా కోరి చేసుకుంటున్నరా లేక ఆయన రాజకీయం ఈ విధంగానే ఉండబోతోందా అన్న చర్చ సాగుతోంది. హైకమాండ్ కి ఎంతో సన్నిహితుడైన నేతగా 2019 దాకా గంటా ఉండేవారు. ఆ తరువాతనే ఈక్వేషన్స్ చాలా మారాయి.
ఆ ఎన్నికల్లో భీమిలీ నుంచి మరోసారి పోటీకి గంటా పట్టుబట్టడం ఆ సీటుని ఆశించిన అప్పటి అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇది పార్టీకి నష్టం కలిగించింది. అంతే కాదు గంటా కూడా గత అయిదేళ్ళలో పార్టీ పరంగా పెద్దగా చేసింది ఏమీ లేదని కూడా హైకమాండ్ గ్రహించే ఆయనకు భీమిలీ టికెట్ ని చివరి నిముషం దాకా కంఫర్మ్ చేయలేదని గుర్తు చేస్తున్నారు.
ఆయన ఎమ్మెల్యే అయిన తరువాత కూడా మంత్రి పదవిని కూడా ఇవ్వలేదని అంటున్నారు. గంటా అయితే తాను అత్యంత సీనియర్ ని అని తనకు మంత్రి పదవి లేకపోవడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనలో ఇటీవల కాలంలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. బాహాటంగాన ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల ఆయన అనుచితమైన భాష వాడారు. ఇపుడు ఏకంగా ప్రభుత్వం తీరుని తప్పు పట్టేలా ట్వీట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారో టీడీపీ రాజకీయం ఎలా ఉంటుందో సూచనప్రాయంగా వెల్లడి అవుతూ వస్తోంది. గంటా తన కుమారుడికి భీమిలీ టికెట్ ఇప్పించుకోవడానికి చూస్తున్నారు. అలాంటపుడు తన కుమారుడి ఫ్యూచర్ దృష్ట్యా అయినా ఆయన కాస్తా సహనంతో ఉండాల్సింది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా గంటా పట్ల హైకమాండ్ వైఖరి మరోసారి వ్యక్తం అయింది అని అంటున్నారు. దాంతో గంటా రాజకీయం ఏ తీరున ఇక మీదట సాగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.