వీరుల పురిటిగడ్డ.. ఒకే గ్రామం నుండి సరిహద్దుల్లో 12000 మంది సైనికులు
అలాంటి ఘాజీపూర్లోని గహ్మర్ అనే గ్రామానికి ఒక స్పెషల్ గుర్తింపు ఉంది. ఈ గ్రామాన్ని 'సైనికుల గ్రామం' అని కూడా పిలుస్తారు.
By: Tupaki Desk | 10 May 2025 8:00 PM ISTదేశంలో ఎన్నో ప్రత్యేకమైన గ్రామాలున్నాయి. ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర, ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లా అలాంటిదే. ఈ జిల్లా వీర జవాన్లకు పుట్టినిల్లుగా పేరుగాంచింది. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి కార్గిల్ యుద్ధం వరకు దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో వీరులను ఈ జిల్లా అందించింది. అలాంటి ఘాజీపూర్లోని గహ్మర్ అనే గ్రామానికి ఒక స్పెషల్ గుర్తింపు ఉంది. ఈ గ్రామాన్ని 'సైనికుల గ్రామం' అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రతి ఇంట్లో ఒక సైనికుడు ఉంటాడు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ గ్రామం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాను ఊరికే వీరుల పురిటిగడ్డ అని అనరు. ఈ జిల్లా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి 1965, 1971, కార్గిల్ యుద్ధం వరకు ప్రతి పోరాటంలోనూ ముందుండి పోరాడింది. ఇదే జిల్లాలోని గహ్మర్ అనే గ్రామం యుద్ధ నైపుణ్యానికి మారుపేరుగా నిలిచింది. ఇక్కడి వీర పుత్రులు 1914 నుంచి 1919 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ గ్రామానికి చెందిన 21 మంది జవాన్లు తమ ప్రాణాలను అర్పించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ఇక్కడి యువతలో సైన్యంలో చేరాలనే కోరిక బలపడింది. నేడు ఈ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ ఓ సైనికుడు ఉన్నారు.
ఘాజీపూర్ అంటేనే వీరుల భూమి అని అర్థం. చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ కూడా దీనిని ధృవీకరించాడు. ఆసియాలోనే అతిపెద్ద గ్రామాలలో ఒకటైన ఘాజీపూర్లోని గహ్మర్ గ్రామం తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు యువకులు భారతీయ సైన్యంలో చేరడానికి ఎక్కడ చూసినా ట్రైనింగ్ తీసుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా గంగా నది ఒడ్డున ఉన్న మఠియా మైదానంలో గహ్మర్కు చెందిన యువకులు భారత సైన్యం యూనిఫామ్ తమ ఛాతీపై ధరించడానికి రాత్రింబగళ్లు కష్టపడుతూ కనిపిస్తారు.
తరతరాలుగా సరిహద్దుల కాపలా
ఈ గ్రామంలో కనీసం ఒక జవానైనా ప్రస్తుతం సైన్యంలో ఉంటాడు లేదా పదవీ విరమణ చేసి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. గణాంకాల ప్రకారం.. ఈ ఒక్క గ్రామం నుంచి 12000 మందికి పైగా సైనికులు దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. గహ్మర్కు వీర సైనికుల గ్రామంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ కుటుంబంలోకి వెళ్లినా తాత పదవీ విరమణ చేసి ఇంటి వద్ద వ్యవసాయం చేస్తుంటే, వారి కుమారుడు దేశ సరిహద్దులను కాపాడుతూ ఉంటాడు. లేదా వారి మనవడు భారతీయ సైన్యంలో చేరడానికి రాత్రింబగళ్లు కష్టపడుతూ ఉంటాడు. ఈ మూడు తరాల కథ ఈ గ్రామం వీరత్వానికి నిదర్శనం.
మొదటి ప్రపంచ యుద్ధంలోనూ భాగస్వామ్యం
ఈ గ్రామ ప్రజలు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా తమ వంతు సేవలు అందించారు. అప్పటి ఆంగ్లేయ పాలనలో 1914 నుంచి 1919 మధ్య జరిగిన ప్రపంచ యుద్ధంలో గహ్మర్ గ్రామానికి చెందిన 228 మంది యోధులు తమ వీరత్వాన్ని ప్రదర్శించారు. వారిలో 21 మంది వీర పుత్రులు తమ ప్రాణాలను అర్పించారు. అప్పటి నుంచి ఈ గ్రామం వీరుల కథ కాలంతో పాటు పెరుగుతూ వచ్చింది. 1965 భారత పాకిస్తాన్ యుద్ధం లేదా 1971 భారత పాకిస్తాన్ యుద్ధం లేదా కార్గిల్ యుద్ధం ఈ అన్ని యుద్ధాలలో ఇక్కడి వీరులు తమ ధైర్యసాహసాలను చాటారు.
గ్రామంలో జరిగిన సైనిక నియామక మేళా
ఈ వీరత్వాన్ని గుర్తించి 1966లో గహ్మర్ గ్రామంలో సైనిక నియామక మేళాను కూడా నిర్వహించారు. ఇందులో బెంగాల్ ఇంజనీర్లో నియామకం కోసం రూర్కీ నుంచి సైనిక అధికారులు కూడా వచ్చారు. అప్పుడు మొదటిసారిగా ఈ గ్రామానికి చెందిన 22మంది యువకులను సైన్యంలోకి సెలక్ట్ చేశారు. ఆ తర్వాత అనేక సంవత్సరాల పాటు గ్రామంలోనే నియామక శిబిరాలు నిర్వహించారు. ఈ నియామక శిబిరాలు 1984 వరకు కొనసాగాయి.. ఇందులో 37 మంది యువకులు ఎంపికయ్యారు. ఇతర గ్రామాల నుంచి కూడా 11 మంది యువకులు ఎంపికయ్యారు. కానీ 1985 తర్వాత ఈ గ్రామంలో నియామక ప్రక్రియ నిలిపివేసింది.
గ్రామానికి చెందిన అఖండ గహ్మరి మాట్లాడుతూ.. రెండవ ప్రపంచ యుద్ధంలో గహ్మర్కు చెందిన 21మంది జవాన్లు అమరులయ్యారని తెలిపారు. ఆ తర్వాత గ్రామ దేవత తన కుమారులపై చూపిన ఆశీర్వాదం వల్ల 1965, 1971, కార్గిల్ యుద్ధాలలో గహ్మర్కు చెందిన యువకులు పోరాటంలో పాల్గొన్నారు. కానీ అమ్మవారి దయ వల్ల ఇక్కడి ఒక్క జవాను కూడా యుద్ధరంగంలో అమరుడు కాలేదు అని ఆయన చెప్పారు.