'ఇంకెంత' పెరగొచ్చు బ్రదర్: దేశవ్యాప్తంగా ఇదే టాక్!
మనసులో బాధ.. పర్సు ఖాళీ అవుతోందన్న ఆవేదన.. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయత.. వెరసి సాధారణ ప్రజల పరిస్థితి దినదినగండంగా మారిపోయింది.
By: Garuda Media | 24 May 2026 9:43 AM ISTమనసులో బాధ.. పర్సు ఖాళీ అవుతోందన్న ఆవేదన.. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయత.. వెరసి సాధారణ ప్రజల పరిస్థితి దినదినగండంగా మారిపోయింది. వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు.. సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు.. తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పెట్రోలు, డీజిలేకదా.. అని పైకి చెబుతున్నా.. దీనికి మించి ఇతర నిత్యావసర వస్తువుల నుంచి రోజూ వినియోగించే టూత్ పేస్టులు, సబ్బుల వరకు కూడా ధరలు పెరిగిపోయాయి. గత వారంలోనే సబ్బులు, టూత్ పేస్టుల ధరలు.. 10-20 మధ్య పెరగడం గమనార్హం.
ఇక, బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయన్న అంచనాలు వున్నాయి. రైసు మిల్లులకు పెట్రోలుతో పనేంటని అందరూ అనుకోవచ్చు. వీటికి పెట్రోల్ తో పనిలేకుండా.. ధాన్యం రవాణా నుంచి బియ్యం ఆడించే వరకు.. అక్కడ నుంచి సాధారణ షాపులు.. అటు నుంచి మన ఇంటికి చేరే వరకు రవాణా అయితే.. చేయాలి కదా!. ప్రస్తుతం రవాణా చార్జీలు తడిసి మోపెడవు తున్నాయి. దీంతో ఆ భారం బియ్యంపైనే పడుతోంది. నిన్న మొన్నటి వరకు సన్నబియ్యం 25 కిలోల బస్తా.. ఏపీలో 1200 నుంచి 1350 ఉండగా.. ప్రస్తుతం 1650కి ఏదీ తక్కువ లేదు. అసలు 1500 అంటే కూడా.. పలికే నాథుడు కనిపించడం లేదు.
ఇక, నూనెల ధరలు కూడా అలానే మండిపోతున్నారు. గత నెలలో అంటే.. పెట్రోలు ధరలు పెరగక ముందు.. లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్.. 160-170 రూపాయల మధ్య పలికింది. కానీ.. ఇప్పుడు 180కి పైమాటే అంటే ఆశ్చర్యం వేసినా.. నిజం. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రధాన మంత్రి మోడీ.. నూనెలను తగ్గించాలని సూచించారు కదా.. అంటారేమో.. కానీ.. ఎంతైనా అలవాటు పడిన ప్రాణం కావడంతో ప్రజలు అలమటిస్తున్నారు. పోనీ హోటల్కు వెళ్లి తిందామా? అంటే.. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా యి. సాధారణ ఇడ్లీనే 40 రూపాయలకు తక్కువ లేదు. ఇక, దోశలు.. వెరైటీ టిఫిన్లు కావాలంటే.. 100 వదిలించాల్సిందే!.
ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక మాట.. ఇంకెంత పెరుగుతుంది బ్రో..! అనే. పెట్రోల్ బంకులకు వస్తున్న వినియోగదారులు.. ధరలపై ఆరా తీస్తున్నారు. ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇంకెత పెరుగుతుంది? ఎప్పుడు పెరగొచ్చు.. ఇలా ఆరా తీస్తుండడంతో పెట్రోల్ బంకుల యజమానులు బోర్డులు పెడుతున్నారు. ``ధరల పెంపు మా చేతిలో లేదు. మాకు తెలియదు`` అని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల్లో బోర్డులు పెట్టారంటే.. ప్రజల నుంచి ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు!!. సో.. ఇదీ సంగతి!!.
