Begin typing your search above and press return to search.

జైల్లో మహిళా ఖైదీలకు గర్భం... 196 మంది పిల్లలు!!

మహిళా ఖైదీలు ఉన్న ఎన్ క్లోజర్స్ లోని పురుష ఉద్యోగులు వెళ్లడమే దీనీకి కారణమా అనే సందేహం తెరపైకి వచ్చిందని తెలుస్తుంది!

By:  Tupaki Desk   |   9 Feb 2024 9:30 AM GMT
జైల్లో మహిళా ఖైదీలకు గర్భం... 196 మంది పిల్లలు!!
X

జైళ్లో మహిళా ఖైదీలు గర్భం దాలుస్తున్నారు! పిల్లలకు జన్మనిస్తున్నారు! దీంతో అసలు ఆ జైళ్లలో ఏమి జరుగుతుంది..? అనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ విషయాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా ఖైదీలు ఉన్న ఎన్ క్లోజర్స్ లోని పురుష ఉద్యోగులు వెళ్లడమే దీనీకి కారణమా అనే సందేహం తెరపైకి వచ్చిందని తెలుస్తుంది!

అవును... పశ్చిమ బెంగాల్‌ లో జైలులో ఉన్న మహిళ ఖైదీలు గర్భం దాల్చిన సంఘటనలు వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పెను దుమారం రేపుతోంది. దీంతో... ఈ వ్యవహారంపై కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంపై అమికస్ క్యూరీని నియమించిన కలకత్తా హైకోర్టు.. రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

దీంతో అమికస్ క్యూరీ రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి, పొందుపరిచిన వివరాలను కలకత్తా హైకోర్టుకు అందించారు. ఇందులో భాగంగా... వెస్ట్ బెంగాళ్ లోని జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు ఇప్పటివరకు సుమారు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. వారంతా కస్టడీలో ఉన్న సమయంలోనే గర్భం దాల్చి.. ప్రసవించినట్లు వెల్లడించారు.

దీంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తూ గర్భం దాల్చడం, పిల్లలను కనడం విషయంపై కలకత్తా హైకోర్టు సీరియస్ గా స్పందించింది.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్యను అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో అమికస్ క్యూరీ హైకోర్టుకు కొన్ని విజప్తులు చేశారు.

ఇందులో ప్రధానంగా... మహిళా ఖైదీలు ఉండే ఎన్‌ క్లోజర్లు, కరెక్షన్ హోంస్ లో పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో... ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టిఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిం భట్టాచార్యలతో కూడిన ద్వి సభ్య ధర్మాసనం ఈ అంశాన్ని తీవ్ర సమస్యగా పరిగణించింది.

ఇందులో భాగంగా... క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌ కు ఈ వ్యవహారాన్ని బదిలీ చేయడం సరైందని భావించి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సోమవారం మరోసారి విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.