Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బస్సు ఓవర్ టేక్.. కండక్టర్ పై దాడి

తాజాగా అలాంటి పరిస్థితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. ఇరవై మంది అనుచరుల్ని వేసుకొని మదనపల్లి బస్టాండ్ లో వీరంగం వేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   16 May 2025 5:15 AM
Ex-YSRCP MLA Sparks Chaos at Madanapalle Bus Stand
X

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అంటే మాటలా? అందునా తన వ్యాపారానికి అడ్డుగా ఉన్నోళ్లను ఊరుకుంటారా? తాజాగా అలాంటి పరిస్థితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. ఇరవై మంది అనుచరుల్ని వేసుకొని మదనపల్లి బస్టాండ్ లో వీరంగం వేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలేం జరిగిందంటే..

ఏపీలోని కొన్ని సరిహద్దు జిల్లాల్లో ఇతర రాష్ట్రాలకు ప్రైవేటు బస్సుల్ని నడిపిస్తుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆర్టీసీ మాదిరే.. తక్కువ దూరాలకు ప్రైవేటు బస్సులు నడిపించటం తెలిసిందే. వారి మధ్య ఉండే వ్యాపార పోటీలో భాగంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఉన్నాయి. వీరికి పోటీగా మధుసూదన అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి.

వీరి బస్సులు బెంగళూరు నుంచి మదనపల్లె మధ్య నడుస్తుంటాయి. ఈ క్రమంలో వీరి బస్సుల మధ్య పోటీ.. ప్రయాణికుల్ని ఎక్కించుకునే విషయంలో ఒకరి బస్సుల్ని మరొకరు ఓవర్ టేక్ చేయటం లాంటి జరుగుతుంటాయి. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు చెందిన బస్సును మధుసూదన ట్రావెల్స్ బస్సు తరచూ ఓవర్ టేక్ చేస్తోంది. గతంలో ఈ విషయంపై రెండు బస్సులకు చెందిన వారి మధ్య గొడవలు జరిగాయి.

గురువారం మధ్యహ్నం మధుసూదన బస్సు మదనపల్లెలోని బెంగళూరు బస్టాండ్ కు చేరుకోగా.. ప్రయాణికులు ఎక్కుతున్నారు. దీంతో ఆగ్రహించిన మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా.. ఇరవైమందికి పైగా అనుచరులతో కలిసి బస్టాండ్ కు వచ్చి.. మదుసూదన అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్ హరినాథ్ మీద దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తమ బస్సుల కంటే ముందుగా ఎందుకు వస్తున్నారని.. తమ బస్సుల్ని ఎందుకు ఓవర్ టేక్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు బస్టాండ్ కు చేరుకొని మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. తనపై దాడికి పాల్పడినట్లుగా పేర్కొంటూ బస్సు కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. మాజీ ఎమ్మెల్యేపైనా.. ఆయన అనుచరులపైనా కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.