Begin typing your search above and press return to search.

టార్గెట్ బీసీ: స్ట్రాట‌జీ ప్లే చేసిన ఈట‌ల!

బీసీల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. "కేసీఆర్ బీసీల‌ను ఏడ్పించిండు. కాల్చుకు తిన్న‌డు" అంటూ.. సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 5:30 PM GMT
టార్గెట్ బీసీ:  స్ట్రాట‌జీ ప్లే చేసిన ఈట‌ల!
X

బీసీ ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్న బీజేపీ.. ఇప్ప‌టికే తాము అధికారంలోకి వ‌స్తే బీసీని ముఖ్య‌మం త్రిని చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఇక‌, బీజేపీ అగ్ర‌నేత‌ అమిత్ షా దిశానిర్దేశ‌మో.. లేక బీసీఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకొనే వ్యూహ‌మో తెలియ‌దు కానీ బీజేపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ రంగంలోకి దిగిపోయారు. బీసీల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ''కేసీఆర్ బీసీల‌ను ఏడ్పించిండు. కాల్చుకు తిన్న‌డు'' అంటూ.. సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

''నేను బీసీ నేత‌నే. ముందు ఎంతో మురిపించాడు. త‌ర్వాత‌.. వేధించాడు. క‌న్నీళ్లు కారిస్తే.. ఆ నీళ్లు చూసి సంతోషించిండు. కేసీఆర్‌కు బీసీలంటే.. దుయ్య‌(ప‌డ‌దు). బీసీల ఓట్లు మాత్రం కావాలంట‌డు. మ‌నం ఎలా ఏస్తం. మ‌నకు పౌరుషం లేదా? మ‌న నెత్తురు, చీమును మానాన్ని అమ్ముకుంద‌మా? తాక‌ట్టు పెడ‌దమా?'' అని ఈట‌ల నిప్పులు చెరిగారు. బీసీల విష‌యంలో కేసీఆర్ వివ‌క్ష చూసి తాను చాలా సార్లు ఏడ్చేచిన‌ట్టు ఈట‌ల చెప్పారు. బడుగులకు అధికారం రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని మండిపడ్డారు.

''అధికారంలోకి వ‌స్తే.. ఎస్సీని ముఖ్య‌మంత్రిని చేస్త‌న‌ని మాట త‌ప్పిండు. బీసీల‌కు పెద్ద‌పీట వేస్త‌న‌ని చెప్పి గుదిబండ అయిండు. గిరిజన, ఆదివాసీ బిడ్డలను మోసం చేసిండు. అందరినీ మోసం చేసి ఆయన కుటుంబం తెలంగాణను పాలిస్తోంది'' అని విమ‌ర్శించారు. బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారని.. బీసీలు అంటే కేసీఆర్‌కు చిన్న చూపు, చులకన అని వ్యాఖ్యానించారు.

బీసీల‌ను ఆద‌రించే పార్టీ బీజేపీనేన‌ని ఈట‌ల చెప్పుకొచ్చారు. దేశానికి బీసీ బిడ్డ‌ను ప్ర‌ధానిని చేసింది కూడా బీజేపీనేనన్నారు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతిని చేసింది బీజేపీ మాత్రమేన‌న్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఎంత మందికి టికెట్ లు ఇచ్చారో చెప్పాల‌ని ఈట‌ల స‌వాల్ విసిరారు. బీజేపీ మాత్రం బీసీలకు 40 టికెట్‌లను కేటాయించబోతోందని తెలిపారు. బీసీ సోద‌రులు, సోద‌రీమ‌ణులు బీజేపీకి అండ‌గా నిల‌వాల‌ని ఈట‌ల పిలుపునిచ్చారు.