Begin typing your search above and press return to search.

పదునైన ఈడీ చక్రం బీజేపీ మీద దూసుకెళ్లదేం...!?

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు

By:  Tupaki Desk   |   6 Feb 2024 2:21 AM GMT
పదునైన ఈడీ చక్రం బీజేపీ మీద దూసుకెళ్లదేం...!?
X

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ మాటకు వస్తే సీబీఐ గురించి కూడా తెలియదు. జగన్ కేసుల పుణ్యమాని సీబీఐ ఈడీ అంటే ఏంటో అందరికీ తెలిసాయి. బహుశా అప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్ధుల మీద ఈడీ సీబీఐ వాడకం కూడా బాగా పెరిగింది అని విమర్శలు కూడా ఉన్నాయి.

ఈ రెండూ కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఎవరు కేంద్రంలో పాలిస్తూంటే వారి ప్రత్యర్ధుల పాపాలు పండినట్లే. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంటే గుజరాత్ లో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా సీబీఐ ద్వారా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. అదే అమిత్ షా కేంద్రంలో హోం మంత్రి కాగానే నాటి హోం మంత్రి చిదంబరం అచ్చంగా 105 రోజుల పాటు జైలులో మగ్గాల్సి వచ్చింది.

ఇక ఈడీ చక్రం పదునుగా ఉంటుంది. అది దూసుకుని వస్తే ఇంతే సంగతులు. ఈడీ దాడులు అంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ఈడీ సీఎంలను వదలడంలేదు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ బాధితుడిగా మారి అరెస్ట్ అయి తన సీఎం పదవిని కోల్పోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ పిలుపులు పదే పదే వస్తున్నాయి.

ఈడీ కేవలం విపక్షాల మీదనే పనిచేస్తోందని, దాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపలా బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి పార్లమెంట్ లోనే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ జవాబు పవర్ ఫుల్ గా ఇచ్చేశారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదు అని ప్రధాని అన్నారు.

అంతే కాదు, కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు అని ఆరోపించారు. దేశంలో అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చెశారు. ఇక మరో పోలిక కూడా చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం 5 వేల కోట్ల రూపాయలే సీజ్‌ చేసిందని ఇక తమ హయాంలో లక్ష కోట్ల రూపాయల అక్రమ నగదు సీజ్‌ చేశామని ప్రధాని చెప్పుకున్నారు.

అంతే కాదు విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. వాటిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలా ఈడీ పనితీరు మీద మోడీ సభలో గొప్పగా చెప్పారు అని అంటున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగా అక్రమ నగదు లక్షల కోట్లలో ఈడీ సీజ్ చేయడం మంచి పరిణామమే. కానీ ఈడీ చక్రం ఎపుడూ విపక్షాల వైపే దూసుకుని వెళ్తోంది అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంది. బీజేపీ నేతలలో అంతా మంచివారే ఉండరు కదా. రాజకీయం అన్న తరువాత నూరు శాతం పునీతులు ఉండే చాన్స్ లేదు కదా అని అంటున్నారు.

అలా చూసుకుంటే బీజేపీ నేతల మీద ఈడీ దాడులు ఎందుకు లేవు అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది గతంలో ఒక పార్టీలో ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడాక బీజేపీ పంచన చేరారు. వారి మీద ఈడీ కేసులే లేవు. మరి ఇదేమిటి అన్న ప్రశ్న వస్తోంది. ఇది సగటు జనాల సందేహాలు. మరి వీటిని కూడా బీజేపీ పెద్దలు తీర్చాలి కదా. ఏది ఏమైనా ఈడీ సీబీఐ వంటి సంస్థలకు స్వంత్రంత్ర ప్రతిపత్తిని కల్పిస్తేనే తప్ప పూర్తి న్యాయం జరగదు అన్న వాదనలు ఉన్నాయి.