ల్యాప్టాప్ ఇచ్చిన రోజే గుడ్బై.. కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం వెనుక కారణమిదీ..
నైజీరియాలో జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
By: A.N.Kumar | 6 March 2026 12:00 AM ISTఉద్యోగ వేటలో ఉన్న వారికి ఇంటర్వ్యూలు దాటి.. ఆఫర్ లెటర్ అందుకోవడం ఒక ఎత్తు అయితే.. ఆశించిన సంస్థలో చేరడం మరో ఎత్తు. కానీ రెండు నెలల పాటు ఎదురుచూసి మరీ నియమించుకున్న ఒక అభ్యర్థి.. జాయిన్ అయిన మొదటి రోజే రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉంటుంది? నైజీరియాలో జరిగిన ఈ వింత ఘటన ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
అసలేం జరిగింది?
నైజీరియాకు చెందిన ఒక హెచ్ఆర్ (హెచ్ఆర్) ప్రొఫెషనల్ తన సోషల్ మీడియా వేదికగా ఈ ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు. ఆమె పనిచేస్తున్న సంస్థలో ఒక కీలక పోస్టు కోసం సుమారు రెండు నెలల పాటు వెతికి.. చివరకు ఒక అభ్యర్థిని ఎంపిక చేశారు. కంపెనీ కూడా అతని కోసం రెండు నెలల పాటు ఓపికగా వేచి చూసింది. తీరా అతను ఆఫీస్లో అడుగుపెట్టిన మొదటి రోజే ఊహించని మలుపు తిరిగింది.
ల్యాప్టాప్ వద్దన్నప్పుడే మొదలైన అనుమానం!
ఆన్బోర్డింగ్ ప్రక్రియలో భాగంగా సదరు ఉద్యోగికి కంపెనీ నిబంధనల ప్రకారం ఒక అధికారిక ల్యాప్టాప్ను అందజేశారు. అయితే ఆ ల్యాప్టాప్ చూడగానే అభ్యర్థి ముఖం పాలిపోయింది. తనకు కంపెనీ ల్యాప్టాప్ అవసరం లేదని.. తన సొంత ల్యాప్టాప్నే వాడుకుంటానని పట్టుబట్టాడు. కానీ డేటా సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కంపెనీ పరికరాలనే వాడాలని హెచ్ఆర్ స్పష్టం చేయడంతో అయిష్టంగానే దాన్ని తీసుకున్నాడు. అయితే సాయంత్రం అయ్యేసరికి.. "రెండు ల్యాప్టాప్లు మోయడం భారం అవుతోంది" అనే వింత సాకుతో ఆ పరికరాన్ని ఆఫీసులోనే వదిలేసి వెళ్ళిపోయాడు.
'మూన్లైటింగ్' గుట్టేనా?
ఆ రోజే సాయంత్రం సదరు అభ్యర్థి నుండి హెచ్ఆర్కు ఒక మెసేజ్ వచ్చింది. తాను ఈ ఉద్యోగంలో కొనసాగలేనని.. రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. దీనిపై ఆ హెచ్ఆర్ విశ్లేషిస్తూ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.. అతను తన పాత ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే ఇక్కడ చేరి ఉండవచ్చు. ఒకే టేబుల్పై రెండు వేర్వేరు కంపెనీల ల్యాప్టాప్లు ఉంటే దొరికిపోయే ప్రమాదం ఉందని అతను భావించి ఉండవచ్చు. కంపెనీ ల్యాప్టాప్లో ఉండే ట్రాకింగ్ సాఫ్ట్వేర్ వల్ల తన ఇతర కార్యకలాపాలు బయటపడతాయని భయపడి ఉండవచ్చు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ ఉదంతంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. నేటి కాలంలో ఉద్యోగ భద్రత లేకపోవడం వల్లే చాలామంది ఇలాంటి రిస్కులు తీసుకుంటున్నారు అని కొందరు అంటుంటే.. ఇలాంటి వారి వల్ల నిజంగా ఉద్యోగం కావాల్సిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. కంపెనీలు బ్యాక్గ్రౌండ్ చెక్ కఠినతరం చేయాలి అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య ఉండాల్సిన 'విశ్వాసం' ప్రశ్నార్థకంగా మారుతోందని ఈ ఘటన నిరూపిస్తోంది.
