Begin typing your search above and press return to search.

ఏలూరు సాక్షి ఆఫీసుకు నిప్పు.. అస‌లు వాస్త‌వం ఇదీ: పోలీసులు

ఏలూరు జిల్లాలోని సాక్షి కార్యాల‌యానికి మ‌హిళ‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు నిప్పు పెట్టార‌ని.. సాక్షిని మూసివేయాల‌న్న ప‌ట్టుద‌ల‌, రాజ‌కీయ క‌క్ష‌తోనే ఇలా చేస్తున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   11 Jun 2025 9:59 AM IST
ఏలూరు సాక్షి ఆఫీసుకు నిప్పు.. అస‌లు వాస్త‌వం ఇదీ: పోలీసులు
X

ఏలూరు జిల్లాలోని సాక్షి కార్యాల‌యానికి మ‌హిళ‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు నిప్పు పెట్టార‌ని.. సాక్షిని మూసివేయాల‌న్న ప‌ట్టుద‌ల‌, రాజ‌కీయ క‌క్ష‌తోనే ఇలా చేస్తున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఏలూరులోని సాక్షి కార్యాల‌యం ఉన్న భ‌వ‌నానికి నిప్పు అంటుకున్న విష‌యం వాస్త‌వ‌మే. దీంతో సాక్షిలో ప్ర‌క‌టించిన‌ట్టు, ప్ర‌సారం చేసిన‌ట్టు అంద‌రూ... కూడా ఎవ‌రోఆందోళ‌న కారులు.. నిప్పు పెట్టి ఉంటార‌ని అనుకున్నారు.

కానీ, గంట‌లు గ‌డిచే కొద్దీ.. దీనిలోని వాస్త‌వాలు వెలుగు చూశాయి. నేరుగా పోలీసులు కూడా కొన్ని విష‌యా లు వెల్ల‌డించారు. దీంతో అది.. ఎవ‌రో పెట్టిన మంట‌లు కాద‌ని.. కొంద‌రు కావాల‌ని పుట్టించిన మంట‌లేన‌ని తెలిసింది. దీనికి సంబంధించి ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. "ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సాక్షి మీడియాకు సంబంధం లేదు'' అని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. ఇది ఒక ఫర్నిచర్ షాప్ గోడౌన్ కి చెందిన రిపేర్ ఫర్నిచర్ షాపుగా ఆయ‌న పేర్కొన్నారు.

ఈ ప్రమాద ఘటనలో దగ్ధం అయిన ఫర్నిచర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామ‌ని శ్ర‌వ‌ణ్ కుమార్ వెల్ల‌డించారు. పోలీసులు మంటలు ఆర్పుతున్న సమయం తర్వాత అక్కడికి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మహిళలు నిరసన కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా అక్కడికి చేరుకున్నారని తెలిపారు. ఘటన సమయంలో ఉన్న వీడియోలలో ఇది స్పష్టంగా రికార్డ్ అయిందన్నారు.

అసలు ఈ అగ్ని ప్రమాద ఘటనకు సాక్షికి ఎలాంటి సంబంధం లేదని, అలాగే మంటలు ఏర్పడే సమయా నికి ర్యాలీ కనీసం 200 మీటర్లు దూరంలోనే ఉందని వివ‌రించారు. "ఏలూరులో సాక్షి కార్యాలయంపై దాడి అని, సాక్షి ఫర్నిచర్ దగ్ధం అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు అవాస్తవం. ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్లపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం'' అని శ్ర‌వ‌ణ్ కుమార్ హెచ్చ‌రించారు.

దీంతో అవి `పెట్టిన మంట‌లు` కావ‌ని.. రాజ‌కీయంగా మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు `పుట్టించిన మంట‌లే`న‌ని స్ప‌ష్ట‌మైంద‌ని టీడీపీ నాయ‌కులు పేర్కొన్నారు. కాగా.. ఈ మంట‌లు రాజుకున్న భ‌వనం పై అంత‌స్థులో సాక్షి రిపోర్టింగ్ విభాగం ఉంది. దీనికి ఎలాంటి మంట‌లు అంటుకోలేదు.