Begin typing your search above and press return to search.

ఇక‌, తలుపులు మూసుకున్న‌ట్టే.. !

ఇలాంటి వారిలో వైసీపీలోనే ఎక్కువ మంది నాయ‌కులు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

By:  Garuda Media   |   25 May 2026 4:00 AM IST
ఇక‌, తలుపులు మూసుకున్న‌ట్టే.. !
X

కొంద‌రు నాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల వ్య‌వ‌హారం ఇబ్బందిగానే మారింది. సిట్టింగ్ నాయ‌కుల ప‌రిస్థితి ఎలా.. ఉన్న‌ప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో ఓడిపోయిన వారికి కూడా.. పార్టీలువ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌చ్చ‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి వారిలో వైసీపీలోనే ఎక్కువ మంది నాయ‌కులు ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. గుంటూరు ఎంపీగా అవ‌కాశం ఇవ్వాల‌న్న అభ్య‌ర్థ‌న‌ను వైసీపీ ప‌క్క‌న పెట్టింది.

అదేవిధంగా రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడికి వైసీపీలో కీల‌క పోస్టు ద‌క్కుతుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా.. ఆయ‌న‌ను కూడా పార్టీ దూరం పెట్టింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నారా లోకేష్‌ను ఓడిస్తాన‌ని పంతం ప‌ట్టిన రాయ‌పాటి వార‌సుడు.. వైసీపీకి అనుకూలంగా ఆన్‌లైన్ ప్ర‌చారం చేశారు. కానీ, ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దీంతో సైలెంట్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు గుంటూరు ఎంపీ.. టికెట్ కావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. కానీ, ఫ‌లితం ఆశించిన‌ట్టుగా లేదు.

అలానే.. గుంటూరుకు చెందిన మ‌రో కీల‌క నాయ‌కుడి వార‌సుడు కూడా.. ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, నెల్లూరుకు చెందిన మ‌రో వార‌సుడి ప‌రిస్థితి కూడా అడ‌క‌త్తెర‌లో ఉన్న‌ద‌న్న చ‌ర్చ ఉంది. ఈయ‌న వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఇంచార్జ్‌గా కూడా ఉన్నారు. కానీ, స‌రైన స‌మ‌న్వ‌యం లేక పోవ‌డంతోపాటు.. స్థానిక నాయ‌కుల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి.

ఇలా.. వైసీపీలోనే కాదు.. టీడీపీలోనూ చాలా మంది నాయ‌కుల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ద‌క్క‌క పోవ‌చ్చ‌న్న చ‌ర్చ సాగుతోంది. వారు చేసుకున్న రాజ‌కీయాలు.. వ్య‌క్తిగ‌తంగా త‌మ గ్రాఫ్‌ను పెంచుకోక పోవ‌డం.. పార్టీల‌పైనే ఆధార‌ప‌డ‌డం.. రాజ‌కీయంగా వారు వేస్తున్న అడుగులు వంటివి పెద్ద ఎత్తున మైన‌స్ అవుతున్నాయ‌ని అంటున్నారు. వీటిని స‌రిచేసుకునేందుకు స‌మ‌యం ఉన్నా.. ప‌ట్టించుకోక‌పోవ‌డం కూడా వీరికి పెద్ద ఎత్తున మైన‌స్‌గా మారిపోయింది.