మత్తు వైద్యులు కాదు.. ’మత్తు’లో వైద్యులు.. తెలంగాణలో మరీ ఇంతమందా?
వీరంతా చదువుల ఒత్తిడి, ఫ్రెండ్స్ ప్రభావం, అప్పటివరకు అనుభవించని స్వేచ్ఛ హాస్టల్ లో లభించడంతో తాము డ్రగ్స్ కు అలవాటైనట్లు చెప్పారు.
By: Tupaki Desk | 11 May 2025 9:30 AM’మత్తు’.. ఇది ఎంతకైనా దారితీస్తుంది. ఒక్కసారి అలవాటైతే అంత తొందరగా వదలదు.. జీవితాన్ని నాశనం చేసేవరకు తీసుకెళ్తుంది.. అది మద్యం అయినా ధూమపానం అయినా.. డ్రగ్స్ అయినా.. ఇప్పుడు సమాజంలో మద్యం, ధూమపానం కంటే డ్రగ్స్ వ్యసనం అధికం అయింది.
తాజాగా హైదరాబాద్ కు చెందిన కేవలం 34 ఏళ్ల వయసున్న ఓ యువ వైద్యురాలు డ్రగ్స్ కు బానిస కావడం.. ఏడాదిలో రూ.70 లక్షల డగ్ర్స్ కొన్నట్లు వస్తున్న కథనాలు అత్యంత సంచలనం రేపుతున్నాయి. పైగా ఈమె ఓ పెద్ద ఆస్పత్రి ఓనర్ కుమార్తె. ఆంకాలజీలో ఎండీ చేసిన ఆమె.. ఎంబీఏ కోసం స్పెయిన్ కు వెళ్లి సందర్భంలో డ్రగ్స్ కు బానిస అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ కు వచ్చాక వైద్యురాలికి డ్రగ్స్ వ్యసనం మరింత తీవ్రమైంది. ముంబైకి చెందిన వ్యక్తి ద్వారా డ్రగ్స్ కొంటూ పట్టుబడింది. ఆమె ఉదంతం తర్వాత చూస్తే.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రెండేళ్లలో 20 మంది వైద్యులు డ్రగ్స్ కు బానిస అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో కొందరు రిహాబిలిటేషన్ సెంటర్ ల ద్వారా మత్తు వ్యసనం నుంచి బయటపడ్డారు.
కొందరు వైద్యులు ప్రైవేటు హాస్పిటల్స్ దగ్గర మెడికల్ షాప్ లు ఏర్పాటు చేసి.. సర్జరీలకు వాడే మత్తు ఇంజక్షన్లు, నొప్పులతో బాధపడే వారికి ఇచ్చే మత్తు ఇంజక్షన్లను మత్తు బానిసలకు విక్రయిస్తున్నట్లు తేలింది.
హైదరాబాద్ ధూల్ పేట పెడ్లర్ వద్ద 10 మంది మెడికోలు గంజాయి కొంటున్నట్లు కూడా ఆ మధ్య బయటపడింది. వీరంతా చదువుల ఒత్తిడి, ఫ్రెండ్స్ ప్రభావం, అప్పటివరకు అనుభవించని స్వేచ్ఛ హాస్టల్ లో లభించడంతో తాము డ్రగ్స్ కు అలవాటైనట్లు చెప్పారు.
హైదరాబాద్ లో ఓ వైద్యుడు అయితే తాను పని ఒత్తిడి నుంచి ఉపశమనానికి డ్రగ్స్ తీసుకుంటున్నట్లు చెప్పాడు. డ్రగ్స్ వాడుతున్న ప్రైవేటు ఉద్యోగులు, ఐటీ నిపుణులు కూడా పని ఒత్తిడినే సాకుగా చూపుతుండడం గమనార్హం.
ఇక మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని, మత్తు బానిసలకు వైద్యం చేసే వైద్యులే మత్తుకు బానిసలు కావడం సంచలనం రేపుతోంది.
యోగా, ధ్యానం, స్పోర్ట్స్ అసలైన 'మత్తు' ఇది..
పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మత్తును ఆశ్రయించడం కంటే పొరపాటు ఇంకోటి లేదు. రేపు మరింత పని ఒత్తిడి ఉంటే మరింత మత్తు తీసుకుంటారా? అనేది ఆలోచించాలి. అంతేకాదు.. మత్తు శరీరాన్ని నిస్సత్తువ చేస్తుంది. ప్రొడక్టివిటీని తగ్గించేస్తుంది. జీవితంలో మధుర క్షణాలను అనుభవించకుండా చేస్తుంది. చివరకు రోగిని చేస్తుంది.. మరి ఒత్తిడి నుంచి రిలీఫ్ ఎలా అంటారా? యోగా, వ్యాయామం, స్పోర్ట్స్, ధ్యానం, గార్డెనింగ్ ఇలా చాలా మార్గాలు ఉన్నాయి. ఇవి మంచి చేసే ’మత్తు’ అన్నమాట. కాకపోతే అలవాటు కావడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కసారి అలవాటైతే వదలరు.
ముఖ్య విషయం..: యోగా, స్పోర్ట్స్, వ్యాయామం చేసేవారిని చూడండి.. 90 శాతం మంది వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ దురలవాట్లు ఉన్నా.. చాలా పరిమితంగానే. అందుకే ఏది మంచో ఏది చెడో గమనించండి.